సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : మహానగరానికి మణిహారంలా మారిన మెట్రో రైలు సేవలు మొదలై 6 ఏండ్లు పూర్తయ్యాయి. నవంబర్ 29, 2017న ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథులుగా నగరంలో మెట్రో సేవలు ప్రారంభించారు.నాగోల్ నుంచి అమీర్పేట, అమీర్పేట నుంచి మియాపూర్ వరకు మొదటి దశలో ప్రారంభించగా, ఆ తర్వాత దశల వారిగా వివిధ కారిడార్లలో మెట్రో రైళ్లను నడిపారు.
మొత్తంగా నగరంలో మూడు కారిడార్లలో 69 కి.మీ మేర మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. రోజుకు సుమారు 5 లక్షల మంది వరకు మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. విజయవంతంగా 6 ఏండ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు బుధవారం ప్రత్యేకంగా సంబురాలు నిర్వహించారు.