Hyderabad | హైదరాబాద్లో చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. కుత్బుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రహదారి పక్కన అర్ధరాత్రి తల్లి ఒడిలో నిద్రిస్తున్న ఆరు నెలల చిన్నారిని దుండగులు ఎత్తుకెళ్లారు.
వివరాల్లోకి వెళ్తే.. మల్లారెడ్డి ఆస్పత్రి ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న మార్బుల్ షాపు వద్ద ఆదివారం అర్ధరాత్రి నవనీత అనే మహిళ తన నలుగురు పిల్లలతో నిద్రిస్తున్నది. తల్లి నిద్రలో ఉన్న సమయంలో ఒడిలో నిద్రిస్తున్న ఆరు నెలల చిన్నారి ఆశను ఎవరో దుండగులు ఎత్తుకెళ్లారు. కాసేపటికి మెలకువ వచ్చిన నవనీత చుట్టుపక్కల వెతకగా పాప కనిపించకపోవడంతో ఆందోళనకు గురైంది.
వెంటనే కుత్బుల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తల్లి నవనీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు.