సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలో 560 వరకు విద్యుత్ బస్సులు ఏర్పాటు చేయాల్సి ఉన్న ఆర్టీసీ యాజమాన్యం ప్రస్తుతం ఆ దిశగా ముందుకు సాగడం లేదు. ఎప్పటి వరకు విద్యుత్ బస్సులు ఏర్పాటు చేస్తారనేది అధికారులు చెప్పలేకపోతున్నారు. ఒక పక్క మహాలక్ష్మి పథకం నేపథ్యంలో ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికులకు సరిఫడా బస్సులు లేకపోవడంతో 2010కి ముందు కొనుగోలు చేసిన డీజిల్ బస్సులను నడుపుతున్నారు. అదేవిధంగా విద్యుత్ బస్సులు కొనుగోలు చేయడానికి బదులుగా వాటి స్థానంలో 340 డీజిల్ బస్సులు (బీహెచ్-4) అద్దె ప్రాతిపదికన కొనుగోలు చేసే కార్యక్రమానికి ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టింది. ఈ నెల 15న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి 22 నుంచి ఆన్లైన్ టెండర్ల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించారు. జనవరి 3వరకు గడువు విధించడంతో పాటు అదే రోజు టెండర్లు ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నట్లు టెండర్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గురువారం జేబీఎస్లోని రెండో అంతస్థులో అద్దె బస్సుల ప్రీ బిడ్డింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. త్వరలోనే మరో 200 డీజిల్ బస్సులకు కూడా టెండర్లు పిలువబోతున్నారు. అందుకోసం సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నారు.