నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ట్రై పోలీసు కమిషనరేట్ పరిధిలో నూతన పోలీసు కమిషనర్లుగా బాధ్యతలు తీసుకున్న సీపీలు నగరంలో డ్రగ్స్ వినియోగం, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. తొలి సమీక్షా సమావేశాల్లో కూడా ఇదే అంశాలపై ఎక్కువగా నజర్ పెట్టారు. మత్తు పదార్థాల నివారణకు షాడో బృందాలను కూడా రంగంలోకి దించారు. ఈ బృందాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు గంజాయి సరఫరాదారులపై దాడులు జరిపి పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకుని, నిందితులను కటకటాల్లోకి నెట్టగలుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గడిచిన రెండు రోజుల్లోనే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1.6 కోట్ల విలువైన 500కిలోల గంజాయిని పట్టుకుని 6మంది నిందితులను అరెస్టు చేశారు. ఇందులో ఒడిశా నుంచి ధూల్పేటకు100కిలోల గంజాయిని తరలిస్తున్న కేసులో ఇద్దరు నిందితులను, ఒడిశా నుంచి మహారాష్ట్రకు 400కిలోల గంజాయిని తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇక రాచకొండ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సుధీర్బాబు శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
– సిటీబ్యూరో, డిసెంబరు 16 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్థాల రవాణాపై సైబరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ వినియోగంపై, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని ఇటీవలే సైబరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన అవినాష్మహంతి ఆ దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ మాఫియాల మత్తు దించాల్సిందేనని సీపీ పోలీసు అధికారులను ఆదేశించారు.ఈ క్రమంలోనే గంజాయి, ఇతర డ్రగ్స్ రవాణా, క్రయ, విక్రయాలపై పటిష్ట నిఘా పెట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిసింది.
ఈ బృందాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆ మేరకు ఇక్కడకు వచ్చే గంజాయి రవాణాపై దాడులు జరిపి పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకుని, నిందితులను కటకటాల్లోకి పంపిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగానే గడిచిన రెండు రోజుల్లోనే కమిషనరేట్ పరిధిలో 1.6 కోట్ల విలువైన 500 కిలోల గంజాయిని పట్టుకుని నిందితులను అరెస్టు చేశారు. ఇందులో ఒడిశా నుంచి ధూల్పేటకు 100 కిలోల గంజాయిని తరలిస్తున్న కేసులో ఇద్దరు, ఒడిశా నుంచి మహారాష్ట్రకు 400 కిలోల గంజాయిని తరలిస్తున్న కేసులో ఇద్దరు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
డ్రగ్స్ నివారణ కోసం షాడో బృందాలు రంగంలోకి దిగాయి. ఈ బృందాలు గంజాయిని పండించే ప్రాంతాలు, విక్రయించే వారి వివరాలతో పాటు రవాణా చేసేవారి వివరాలను సేకరిస్తాయి. నగరంలోనే కాకుండా గంజాయి పండించే ప్రాంతాలైన ఒడిశా, విశాఖపట్నం, విజయనగరం తదితర ప్రాంతాల్లో ఈ షాడో బృందాలు నిఘా పెడుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
గంజాయి సాగుచేసే వారితో పాటు వారి వద్ద నుంచి కొనుగోలు చేసే వారిపై ఈ బృందాలు నిరంతరం నిఘా పెడతాయి. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సంబంధిత దర్యాప్తు సంస్థలకు చేరవేస్తాయి. సాగు కేంద్రాల వద్ద నుంచి ఎవరైనా గంజాయి కొనుగోలు చేసినా, నగరానికి గాని లేదా నగరం మీదుగా ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేసినా వెంటనే ఆ సమాచారాన్ని పూర్తి ఆధారాలతో సంబంధిత పోలీసులకు షాడో బృందాలు చేరవేస్తాయి. ఈ మేరకు పోలీసు బృందాలు అప్రమత్తమై గంజాయి మాఫియాలపై మెరుపు దాడులు జరిపి, నిందితులను అరెస్టు చేస్తారని.. అలాగే గంజాయిని సీజ్ చేస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.