PM Modi | సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): కేంద్రం మాటలు.. చేతల్లో కనిపించడం లేదు.. జనాల కష్టాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.. నగరంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఉప్పల్- నారపల్లి, గోల్నాక- రామంతాపూర్ ఫ్లైఓవర్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఐదేండ్లు కావొస్తున్నా.. పిల్లర్లకే పరిమితమయ్యాయి. కేవలం 40 శాతం మాత్రమే పూర్తి చేసి..మిగిలిన పనులకు ఆపసోపాలు పడుతున్నారు. ఎంతో కీలమైన ఈ మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ లేకుండా చేసేందుకు చేపట్టిన ఈ పై వంతెనల నిర్మాణ పనుల ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ తవ్వకాలు చేపట్టడంతో రహదారులంతా గుంతల మయంగా మారాయి. దుమ్ము ధూళితో ప్రజారోగ్యం దెబ్బ తింటున్నది. తెలంగాణ ప్రభు త్వం మాత్రం ఎక్కడా రాజీపడకుండా వేల కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నది. అనేక ఫ్లైఓవర్లు, ఆర్యూబీలు, ఆర్వోబీలను అందుబాటులోకి తీసుకొచ్చి..ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చింది. అయితే కేంద్రం చేపట్టిన ఆ రెండు వంతెనల పనులు మాత్రం వేగంగా సాగడం లేదు. నేడు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఇంకెన్నాళ్లు ఈ పనులు.. ఎన్నిరోజులీ అవస్థలంటూ.. నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.
మాటలు చెప్పడం తేలిక. కానీ పని చేయాలంటే అందుకు చిత్తశుద్ధి ఉండాలి. ఇందుకు నిలువెత్తు సాక్ష్యాలే..ఉప్పల్-నారపల్లి, గోల్నాక-రామంతాపూర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు. ఐదేండ్ల కిందట సాక్షాత్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వచ్చి శంకుస్థాపన చేశారు. పైగా..ఇదే పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న కిషన్రెడ్డి మరో కేంద్ర మంత్రి హోదాలో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కానీ చేతల్లోకి వచ్చే సరికి.. అటు కేంద్రం పట్టించుకోదు.. ఇటు కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి చిత్తశుద్ధి లేదు. దీంతో ఐదు సంవత్సరాల వ్యవధిలో కేవలం 40 శాతం పనులతో కేంద్రం తీరును ఈ పనులు వెక్కిరిస్తున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం నగరంలో వేలాది కోట్ల పనులను పూర్తి చేసి, అనేక ఫ్లైఓవర్లు, ఆర్యూబీలు, ఆర్వోబీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. శనివారం ప్రధానమంత్రి మోదీ పర్యటన నేపథ్యంలో కేంద్రం ఆధ్వర్యంలో నత్తనడకన నడుస్తున్న రెండు ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు ఇంకెన్నాళ్లు? అంటూ నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. మరి.. ప్రధాని వీటికి బదులిస్తారా? ఎన్నికల ఏడాది అయినందున నోటి మాటలు చెప్పి జనాన్ని ఉసూరుమనిపిస్తారా.. అనేది చూడాలి.
హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఉప్పల్- నారపల్లి ఫ్లై ఓవర్, గోల్నాక నుంచి రామంతాపూర్ వరకు పై వంతెన నిర్మాణ పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి..రెండేళ్లలోపే భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేసి కేంద్ర భారత్ మాల పథకం అధికారులకు అప్పగిస్తే ..ఐదేండ్లు కావొస్తున్న పిల్లర్ల వరకే పరిమితమయ్యారు. కేవలం ప్రాజెక్టులో 40 శాతం మాత్రమే పూర్తి చేసి ..మిగిలిన పనుల పూర్తికి అపసోపాలు పడుతున్నారు. ఇదీ ప్రజల సమస్యల పరిష్కారం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి..స్వయంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రాతినిద్యమైన గోల్నాక-రామంతాపూర్ ఫ్లై ఓవర్ పనులు సైతం సకాలంలో పూర్తి చేయలేని దుస్థితి. రాజకీయంగా తొడలు కొట్టడం..రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పబ్బం గడుపుకుంటున్నారే తప్ప నిత్యం జనాలు పడే కష్టాలు మాత్రం అక్కర్లేదంటున్నారు..ఇక ప్రధాని మొదలు కేంద్ర మంత్రుల వరకు రాష్ట్ర నేతలు ఇచ్చే స్క్రిప్ట్ చదివి వెళ్తారే ప్రాజెక్టుల మాట ఊసెత్తడం లేదు..
కీలకమైన మార్గం ఇదే..
హైదరాబాద్కు తూర్పు వైపున ఉప్పల్- వరంగల్ మార్గం చాలా కీలకం. యాదాద్రి, వరంగల్ వైపు నుంచి వచ్చే, వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు ఇటుగానే ప్రయాణించాలి. రోజూ 30వేల నుంచి 40 వేల వాహనాలు ఈ మార్గం గుండా వెళ్తాయి. ఇంత కీలకమైన దారిలో ట్రాఫిక్లేకుండా చేద్దామని చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ పనులు మరింత ట్రాఫిక్ను సృష్టిస్తున్నాయి. రోజూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలుస్తున్నది. ముఖ్యంగా ఉప్పల్ క్రాస్రోడ్డు, నల్లచెరువు కట్ట, కట్టమైసమ్మ టెంపుల్ప్రాంతాల్లో సమస్య ఎకువగా ఉంటున్నది. ఈ మార్గంలోనే హాస్పిటల్స్ ఎకువగా ఉన్నాయి. వాటికి వచ్చే అంబులెన్సులు రోజూ ట్రాఫిక్లో చికుకుంటున్నాయి. పీక్అవర్లో 30 నిమిషాలకు మించుతున్నది. పనుల కారణంగా ప్రమాదాలు జరుగుతున్న దాఖలాలు కోకొల్లలు.
నత్తకు నడకలు నేర్పిన వైనం..
ఉప్పల్ నుంచి నారపల్లి వరకు రూ.626.80 కోట్ల అంచనా వ్యయంతో ఎలివేటెడ్కారిడార్ నిర్మించాలని నిర్ణయించగా, 2018 మే నెలలో కేంద్ర మంత్రి నితిన్గడరీ శంకుస్థాపన చేశారు. ఈ ఫె్లైఓవర్ రామంతాపూర్ వద్ద ప్రారంభమై నారపల్లి సెంట్రల్ పవర్రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వద్ద ముగుస్తుంది. మొత్తం 148 పిల్లర్లపై 45 మీటర్ల వెడల్పుతో ఆరు లైన్లలో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎలివేటెడ్కారిడార్ కు ఇరువైపులా 150 అడుగుల విస్తీర్ణంతో సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ సర్వీస్ రోడ్ పట్టించుకున్న పాపాన పోలేదు. తొలుత 2022 నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలని టార్గెట్ పెట్టుకోగా ఆ స్థాయిలో పనులు జరగలేదు. ఐదేండ్లలో పిల్లర్లకే పరిమితమయ్యారు. ప్రీ-కాస్ట్ పద్ధతిలో పిల్లర్లపై స్లాబ్ ఏర్పాటు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. 148 పిల్లర్లలో128 పిల్లర్లు వేశారు. మిగిలినవి వేయాల్సి ఉంది. నారపల్లి వద్ద ఓ ఐదారు పిల్లర్లపై మాత్రమే ఇప్పటివరకు స్లాబు వేశారు. కాగా పిల్లర్ల ఏర్పాటు కోసం ఎకడికకడ తవ్విపోయడంతో రోడ్డంతా గుంతల మయంగా మారింది. వాహనాలు వెళ్తున్నప్పుడు వచ్చే దుమ్ముతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ)లో భాగంగా మొదటి దశలో రూ.8092 కోట్లతో 48 చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు, కేబుల్ బ్రిడ్జిలు, స్టీల్ బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు 35 చోట్ల ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. 19 ఫ్లై ఓవర్లు, 5 అండర్పాస్లు,ఎనిమిది ఆర్వోబీ/ఆర్యూబీలు, ఒక కేబుల్ బ్రిడ్జిలు, విస్తరణ బ్రిడ్జి ఒకటి, ఓఆర్ఆర్ నుంచి మెదక్ జంక్షన్ వరకు ప్రాజెక్టులు రావడంతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడింది. కాగా అందుబాటులోకి వచ్చిన చోట ట్రాఫిక్ సమస్య పూర్తిగా తొలగిపోయింది.ప్రయాణం సాఫీగా జరగడంతో వాహనదారులకు సమయం, ఇంధనం ఆదా అవుతున్నది.
ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ వివరాలు
ప్రాజెక్టు: ఉప్పల్ రింగు రోడ్డు నుంచి నారాపల్లి వరకు
పనుల ప్రారంభం: 2018 మే 5
పొడవు : 6.25 కిలోమీటర్లు
అంచనా వ్యయం : రూ.626.80కోట్లు
తొలి గడువు: 2020
ప్రస్తుత పరిస్థితి : ఐదేళ్లు కావొచ్చిన 40 శాతం పనులు పూర్తి చేయలేదు..చేసిన ఖర్చు దాదాపు రూ. 260కోట్లు. కేంద్రం ప్రత్యేక దృష్టిసారిస్తే ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చేందుకు కనీసంగా మరో రెండు సంవత్సరాలైనా పడుతుందని స్వయంగా అధికారులే చెబుతుండటం విశేషం.
అంబర్పేట ఫ్లై ఓవర్ విశేషాలు
ప్రాజెక్టు : గోల్నాక నుంచి రామంతాపూర్ వరకు పై వంతెన
పనుల ప్రారంభం : 2018 మే 5
పొడవు : 1.5 కి.మీ
అంచనా వ్యయం : రూ. 216 కోట్లు
తొలి గడువు : 2020
ప్రస్తుత పరిస్థితి : ఐదేళ్లు కావొచ్చిన 50 శాతం పనులు పూర్తి చేయలేదు..చేసిన ఖర్చు రూ.110కోట్లు. మరో ఏడాదిలో పూర్తి చేస్తామని ఇంజినీర్లు చేతులు దులిపేసుకుంటున్నారు.