హైదరాబాద్ : జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తీవ్ర విషాదం నెలకొంది. మల్కారం గ్రామ పరిధిలోని ఎర్రకుంట చెరువులో పడి ఆరుగురు చనిపోయారు. మొదట ఐదుగురు విద్యార్థులు చెరువులో దిగి ఈత కొట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలో చెరువు మధ్యలోకి వెళ్లి నీట మునిగారు. ఒడ్డున ఉన్న ఉపాధ్యాయుడు.. నీటిలో మునుగుతున్న విద్యార్థులను గమనించాడు. వారిని కాపాడేందుకు ఉపాధ్యాయుడు కూడా చెరువులోకి దూకాడు.
విద్యార్థులను కాపాడే క్రమంలో టీచర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. చనిపోయిన పిల్లలందరూ 12 నుంచి 14 ఏండ్ల లోపు వారేనని పోలీసులు తెలిపారు. మృతులను అంబర్పేటలోని మదర్సా విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. విద్యార్థుల, ఉపాధ్యాయుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.