Early Bird | సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): ముందుస్తుగా ఆస్తిపన్ను చెల్లిస్తూ 5 శాతం రాయితీ పొందేందుకు నగరవాసులు అనాసక్తి కనబరుస్తున్నారు. రూ.కోట్లలో పన్ను చెల్లించే బడా సంస్థలతో పాటు సామాన్యులు ఈ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని జీహెచ్ఎంసీ భావించి ప్రతి ఏటా మాదిరిగానే ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు ‘ఎర్లీబర్డ్’ స్కీంను అందుబాటులోకి తెచ్చింది. 30 సర్కిళ్ల పరిధిలోని రూ.800కోట్ల మేర లక్ష్యాన్ని ఖరారు చేసుకున్నది. అయితే గడిచిన 11 రోజులుగా 2.29 లక్షల మంది మాత్రమే సద్వినియోగం చేసుకోగా.. రూ.170 కోట్ల పన్నును రాబట్టుకున్నది.
నిర్దేశిత లక్ష్యంలో ఇప్పటి వరకు 40 శాతం పైగా ఆదాయం దాటలేదు. దీనికి కారణం కమిషనర్ మొదలు ఉన్నతాధికారుల వరకు పార్లమెంటు ఎన్నికల విధుల్లో ఉండటం..క్షేత్రస్థాయిలో ఉండే అధికారులపై పర్యవేక్షణ లేకపోవడం..ఎర్లీబర్డ్ స్కీంపై ప్రజలకు అవగాహన కల్పించకపోవడమేనని అంటున్నారు. ముఖ్యంగా రూ. కోట్లలో ఆస్తిపన్ను బకాయి ఉన్న వారికి తరచూ ఎర్లీబర్ట్ స్కీం సద్వినియోగంపై ఎస్ఎంఎస్లు చేర్చేవారు. కానీ ఈ సారి అవగాహన కల్పనలో అధికారులు ఫెయిల్ అయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అన్ని జోన్ల కంటే ఖైరతాబాద్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి జోన్ల నుంచి ఎర్లీబర్డ్ స్కీంకు ఆశించిన స్పందన రాలేదని సమాచారం.