మేడ్చల్, జనవరి13(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడత కంటి వెలుగు పరీక్షలను ప్రజలందరూ చేసుకునేలా వైద్యశాఖ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కంటి పరీక్షలను చేసుకోవాలని కోరుతూ వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. ఈ నెల 18 న ప్రారంభమయ్యే రెండో విడత కంటి వెలుగు పరీక్షల ఏర్పాట్లలో వైద్యశాఖ నిమగ్నమైంది. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కంటి పరీక్షలకు అవసరమయ్యే పరికరాల పంపిణీ కొనసాగుతున్నది. అలాగే రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల వసతులు ఏర్పాటు చేస్తున్నారు.
కంటి వెలుగు పరీక్షలు విజయవంతం అయ్యేలా ప్రణాళిక
కంటి వెలుగు పరీక్షలు జిల్లా వ్యాప్తంగా విజయవంతం అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. జిల్లాలోని ప్రతి ఇంటికి వెళ్లి కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరుతూ ఇంటింటికి ఆహ్వాన పత్రికలు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజాప్రతినిధులతో కలిసి వైద్యాధికారులు కంటి పరీక్షలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి కంటి పరీక్షలకు హాజరయ్యేలా చూస్తున్నాం. పరీక్షలకు హాజరయ్యేవారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం.
–పుట్ల శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి
418 కంటి పరీక్షల క్యాంపులకుగాను
79 వైద్య బృందాలను వైద్యశాఖ ఏర్పాటు చేసింది. ఇందులో జీహెచ్ంఎసీలో 51, అర్బన్ లోకల్ బాడీలో 18, రూరల్లో 10 వైద్య బృందాలు కంటి పరీక్షలను నిర్వహించనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 27లక్షల 75 వేల మందికి పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలను సిద్ధం చేశారు.
నియోజకవర్గాల వారీగా కంటి పరీక్షల క్యాంపులు..నియోజకవర్గం బృందాలు క్యాంపులు
ఉప్పల్ 12 20
శేరిలింగంపల్లి 05 06
కుత్బుల్లాపూర్ 15 17
మేడ్చల్ 22 337
మల్కాజిగిరి 13 18
ఎల్బీనగర్ 02 04
కూకట్పల్లి 10 16