ప్రయాణికులకు అందుబాటులో 2,700 బస్సులు
రోజుకు 8.50 లక్షల కిలో మీటర్ల ప్రయాణం
సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లోకి త్వరలో కొత్తగా 400 నుంచి 500 ఆర్టీసీ బస్సులు రానున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. కొత్త బస్సుల అంశం త్వరలోనే టెండర్ల ద్వారా ఫైనల్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలో ఆర్టీసీ బస్సులకు రోజురోజుకు ఆదరణ పెరుగుతున్నది. ఇందుకు అనుగుణంగా ఆర్టీసీ గ్రేటర్ అధికారులు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీని ఫలితంగా ఆర్టీసీ రోజుకు రూ.3.50 కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది. తాజాగా ఈ ఆదాయాన్ని రూ.4 కోట్లకు పెంచాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నది.
గ్రేటర్ జోన్లో రోజు ఏడు లక్షల కిలో మీటర్ల నుంచి ఎనిమిదిన్నర లక్షల కిలో మీటర్లు సిటీ బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ.యాదగిరి తెలిపారు. అందుకు అనుగుణంగా 2,700 సిటీ బస్సులను నడుపుతున్నట్టు చెప్పారు. ఇందులో ఆర్డినరీ, ఎక్స్ప్రెస్లతో పాటు ఏసీ బస్సులు కూడా ఉన్నాయని తెలిపారు. నగరంలో ఆర్టీసీ బస్సులను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1000 కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అందులో ఆర్టీసీ గ్రేటర్కు 400 నుంచి 500 వరకు కొత్త బస్సులు వస్తాయని చెప్పారు.
పది పరీక్షలకు బస్ పాసుల రెన్యువల్
పరీక్షల నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు బస్పాస్ రెన్యువల్కు ఆర్టీసీ అధికారులు అవకాశం కల్పించారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈనెల 30తో బస్పాసుల గడువు ముగియనున్నది. అయితే, పరీక్షలను దృష్టిలో పెట్టుకొని పదో తరగతి విద్యార్థులు బస్పాసులు రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ యాదగిరి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంత వరకు బస్పాస్ తీసుకోని విద్యార్థులు కూడా కొత్తగా పాస్ తీసుకోవచ్చని సూచించారు. పాసుల కాల వ్యవధి ముగిసినా, పోగొట్టుకున్నా.. రెండోసారి దరఖాస్తు చేసుకొని పాసులు పొందవచ్చన్నారు. అలాగే, పదో తరగతి చదువుతున్న విద్యార్థినులకు జారీ చేసిన ఉచిత పాసులు కూడా పరీక్షలు పూర్తయ్యేంత వరకు చెల్లుబాటు అవుతాయని, ఇప్పుడున్న ఐడీ కార్డుతోనే ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించినట్లు ఈడీ తెలిపారు.
నగరం నుంచి చేగూరుకు ప్రత్యేక బస్సులు
సికింద్రాబాద్, కాచిగూడ, శంషాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు
ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
మే 2 వరకు కన్హా శాంతివనంలో సహజయోగా
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని చేగూరులో ఉన్న కన్హాశాంతి వనంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సహజ మార్గ స్పిరిచువాలిటీ ఫౌండేషన్ (ఎస్ఎంఎస్ఎఫ్) సహజ యోగా కార్యక్రమాలు ఈనెల 27 నుంచి మే 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే నగర ప్రజల సౌకర్యార్థం సికింద్రాబాద్, కాచిగూడ, శంషాబాద్ నుంచి చేగూరుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, ఆ బస్సులు బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చాయని ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ.యాదగిరి తెలిపారు. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి రూ.150, శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రూ.100, ఏసీ బస్సులకు రూ.300 చొప్పున బస్సు చార్జీలు నిర్ణయించినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం చార్మినార్ డివిజనల్ మేనేజర్ (99592 26129)ను సంప్రదించాలని సూచించారు.