దుండిగల్, మే 16 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలోని ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. సర్వేనంబర్ 307, 329, 342లో వెలిసిన 350 పైగా అక్రమ నిర్మాణాలను ఒక్క రోజే నేలమట్టం చేశారు. రెవెన్యూ డివిజనల్ అధికారి, జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారుల ఆదేశాల మేరకు మేడ్చల్ ఆర్డీవో మల్లయ్య ఆధ్వర్యంలో మంగళవారం కూల్చివేతలు చేపట్టారు. ఇందులో కుత్బుల్లాపూర్, గండిమైసమ్మ-దుండిగల్, బాచుపల్లి, బాలానగర్ మండలాలకు చెందిన తాసీల్దార్లు, సిబ్బంది పాల్గొనగా కూల్చివేతలకు 8 జేసీబీలను వినియోగించారు. జీడిమెట్ల, జగద్గిరిగుట్ట పోలీసుల పతిష్ట భద్రతా ఏర్పాట్ల నడుమ కూల్చివేతలు కొనసాగాయి.
2500పైగా అక్రమ నిర్మాణాలు
గాజులరామారంలోని సర్వేనంబర్ 307, 329, 342లోని వందలాది ఎకరాల ప్రభుత్వ భూముల్లో గత ఏడాదిన్నర కాలంగా సుమారు 2500పైగా అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు గుర్తించిన జిల్లా కలెక్టర్ అందుకు ఆర్ఐ(గిర్ధావర్) పరమేశ్వర్రెడ్డిని బాధ్యుడిని చేస్తూ ఇటీవల విధుల నుంచి తొలగించిన నేపథ్యంలో కూల్చివేతలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
ప్రభుత్వ భూములను ఎవరూ కొనవద్దు : ఆర్డీవో
గాజులరామారంలోని ప్రభుత్వ భూములను ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్న భూకబ్జాదారులు, దళారుల మాటలను ఎవరూ నమ్మవద్దని మల్కాజిగిరి ఆర్డీవో మల్లయ్య పేర్కొన్నారు. విలువైన ప్రభుత్వ స్థలాలను కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు. అదే సమయంలో కబ్జాదారులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.