ఆదిబట్ల/ఇబ్రహీంపట్నం డిసెంబర్ 10: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దంత వైద్యవిద్యార్థిని కిడ్నాప్ కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు నవీన్రెడ్డికి సహకరించిన 32 మందిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆదిబట్ల సీఐ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడ సిరిటౌన్షిప్లో దామోదర్రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నారు. ఆయన కూతురు వైశాలి డెంటల్ డాక్టరుగా చదువు కొనసాగిస్తున్నారు. ఆమెకు నవీన్రెడ్డితో కొంత కాలంగా పరిచయం ఉంది. అయితే ఆమె తల్లిదండ్రులకు వైశాలిని నవీన్రెడ్డికి ఇచ్చి వివాహం చేయడం ఇష్టం లేక తమ బంధువుల అబ్బాయితో పెండ్లి చేసేందుకు నిర్ణయించారు.
శుక్రవారం తాంబూలాలకు ముహూర్తం నిర్ణయించారు. విషయం తెలుసుకున్న నవీన్రెడ్డి శుక్రవారం ఉదయం వైశాలి ఇంటిపై 36 మందితో కలిసి దాడి చేశారు. ఫర్నీచర్, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఫోన్లు పగులకొట్టారు. బలవంతంగా వైశాలిని ఎత్తుకెళ్తుండగా, అడ్డు వచ్చిన ఆమె తల్లిదండ్రులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు 32 మందిని పట్టుకున్నారు. వీరికి ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్యపరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరు పరిచారు.
నవీన్రెడ్డితో పాటు మరో ముగురు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితుల్లో ముగ్గురు ఆయ్యప్ప మాల ధరించి ఉన్నట్లు చెప్పారు. కాగా, నవీన్రెడ్డి తల్లి నారాయణమ్మ మాట్లాడుతూ అమ్మాయి ఇంటిపై దాడి తప్పేనని, తన కుమారుడు కష్టపడి సంపాదించాడని, దామోదర్రెడ్డి వ్యాపారం కోసం డబ్బులు కూడా తీసుకున్నట్లు తన కొడుకు చెప్పాడని అన్నారు.
నవీన్తో నా పెండ్లి జరగలేదు మీడియాతో వైశాలి
నవీన్ అంటే తనకు ఇష్టంలేదని, అతడితో పెండ్లి జరిగిందని చెప్పడంలో వాస్తవం లేదని అపహరణకు గురైన దంత వైద్య విద్యార్థిని వైశాలి అన్నారు. నవీన్రెడ్డి తనను ఘోరంగా కొట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి పొంది..శనివారం ఇంటికి చేరుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు. బ్యాడ్మింటన్ ఆడుతుండగా, నవీన్తో పరిచయం ఏర్పడిందని, అతడితో స్నేహం మాత్రమే ఉండేదని, దీనిని ఆసరాగా చేసుకుని తనను పెండ్లి చేసుకోవాలని కోరితే అంగీకరించలేదని చెప్పారు. దీంతో కక్ష పెంచుకొని.. తనను తరచూ వేధించేవాడన్నారు.
‘నీ ఇష్టంతో నాకు పనిలేదు.. నేను మాత్రం నిన్నే పెండ్లి చేసుకుంటా.. లేదంటే మీ నాన్నను చంపుతామ’ని బెదిరించినట్లు చెప్పారు. ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి.. మార్ఫింగ్ ఫొటోలు పెట్టి.. తన కెరీర్ను నాశనం చేశాడన్నారు. ఒక ఆడపిల్ల అని చూడకుండా పదిమంది వచ్చి తనను బలవంతంగా తీసుకెళ్లారని, హెల్ప్…హెల్ప్ అని అరుస్తుంటే చిత్రహింసలు పెట్టారని చెప్పారు. తన పట్ల నవీన్తో పాటు మరో ఆరుగురు ఘోరంగా ట్రీట్ చేశారన్నారు. నవీన్తో తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఆమె కోరారు.