హైదరాబాద్: హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో (KPHB) విషాదం చోటుచేసుకున్నది. గుడిలో ప్రదక్షిణలు చేస్తుండగా ఓ యువకుడు అమాంతం కుప్పకూలిపోయాడు. మంగళవారం ఉదయం కేపీహెచ్బీకి చెందిన విష్ణువర్ధన్ (31).. స్థానికంగా ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్లాడు. గుడిలో ప్రదక్షిణలు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో తోటివారు అతడిని దవాఖానకు తరలించారు.
అయితే అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతో మరణించాడని తెలిపారు. ఇదంతా గుడిలో ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ ఫుటేజీని స్వాదీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.