కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 11 : రంగధాముని, కాముని, ముళ్లకత్వ చెరువులను రూ.300 కోట్లతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం కూకట్పల్లి జోన్ కార్యాలయంలో చెరువుల అభివృద్ధిపై జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖాధికారులతో ఎమ్మెల్యే కృష్ణారావు, జడ్సీ మమత సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో చెరువులన్నింటినీ సుందరీకరించి ఆహ్లాదకరంగా మార్చేందుకు పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే చెరువులలో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసే పనులు సాగుతున్నాయన్నారు. ముళ్లకత్వ చెరువు, కాముని చెరువు, రంగధాముని చెరువులలో మురుగునీరు చేరకుండా ఎస్టీపీలతో పాటు మురుగునీటి పైప్లైన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. చెరువుల చుట్టూరా వాకింగ్ ట్రాక్, అందమైన మొక్కలు, కుటుంబమంతా సేదతీరేలా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీ రవికుమార్, ఎస్ఈ చిన్నారెడ్డి, ఈఈ సత్యనారాయణ, డీఈ ఆనంద్, తాసీల్దార్ గోవర్ధన్ ఉన్నారు.