కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 4 : అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఇది తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నిరూపితమైందని, సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కృష్ణారావు సమక్షంలో అల్లాపూర్ డివిజన్ రామారావునగర్కు చెందిన 30 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అరవై ఏండ్లలో పరిష్కారం కాని దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ పరిష్కరించడం జరిగిందన్నారు. బాలానగర్, కైత్లాపూర్ ఫ్లైఓవర్లు, కేపీహెచ్బీ కాలనీలో రైల్వే అండర్ బ్రిడ్జిని నిర్మించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించామని, తాగునీరు, విద్యుత్ సరఫరా మెరుగైందని, పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. చేసిన అభివృద్ధి కండ్లముందు కనబడటంతో ఆయా పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. పార్టీలో చేరిన నాయకులు బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.