హైదరాబాద్ : ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యుల వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియాకు వెల్లడించారు. నగరంలోని నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల పేరిట రూ. 1.5 కోట్లు ముఠా వసూలు చేసింది. రైల్వేలో, మెట్రోలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికిన ముఠా.. వారిని సంప్రదించినప్పుడల్లా సమాధానం దాటవేసింది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ముఠా సభ్యుల్లో ముగ్గురిని అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ముఠా ప్రధాన సూత్రధారి సురేంద్ర గుంటూరు వాసి. మోసం చేసిన సొమ్ముతో సురేంద్ర కార్లు, స్థిరాస్తులు కొనుగోలు చేశారు. ఉప్పల్లో ఒక ఇల్లు, హోటల్, నాలుగు కార్లు కొన్నాడు. గతంలోనూ సురేంద్రపై కేసులు నమోదు అయ్యాయి. సుమారు 15 మంది నుంచి డబ్బులు వసూలు చేశారని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.