కేపీహెచ్బీ కాలనీ, జనవరి 12 : కంటి వెలుగు పరీక్షల నిర్వాహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. గురువారం కూకట్పల్లి జోన్ ఆఫీస్లో ఐదు సర్కిళ్ల ఉప కమిషనర్లు ఆయా విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్సీ మాట్లాడుతూ.. జోన్ పరిధిలో ఐదు సర్కిళ్లలో 22 వార్డులకు గాను కంటి వెలుగు పరీక్షల నిర్వాహణ కోసం 26 కేంద్రాలను గుర్తించి.. 26 మంది నోడల్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. స్థానికంగా ఉన్న వార్డు కార్యాలయాలు లేదా సమీపంలోని కమ్యూనిటీ హాళ్లలో కంటి వెలుగు పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఆయా కేంద్రాలలో అవసరమైన విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, తాగునీరు, టాయిలెట్స్, ఇతర వసతులు కల్పించాలని, పరీక్ష కేంద్రాల సమీపంలో దోమల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. డాక్టర్లతో పాటు పరీక్షలకు అవసరమయ్యే టేబుళ్లు, కుర్చీలను ఏర్పాటు చేయాలని అవసరమైన చోట టెంట్ను ఏర్పాటు చేయాలన్నారు. కంటి వెలుగు కేంద్రాలలో ప్రతిరోజూ 300 నుంచి 400 మందికి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈ చిన్నారెడ్డి, డీసీలు రవికుమార్, రవీందర్కుమార్, మంగతాయారు, ప్రశాంతి, నాగవేణి, ఈఈలు గోవర్ధగౌడ్, సత్యనారాయణ, కృష్ణచైతన్య, రాజు, ఏఎంసీ శ్రీకాంత్రెడ్డి, రఘుపతిరెడ్డి, ఎలక్ట్రికల్, ఎంటమాలజీ, డీపీవో విభాగం అధికారులు పాల్గొన్నారు.