Hyderabad | సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : చెరువుల పరిరక్షణలో మేము సైతం అంటూ కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. సహజసిద్ధంగా నీటి వనరులకు కించిత్ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చెరువుల అభివృద్ధి, సుందరీకరణను శరవేగంగా కొనసాగిస్తున్నది. సర్కారు స్ఫూర్తిని అందుకున్న కొన్ని కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతలో భాగంగా (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) కింద పలు చెరువుల అభివృద్ధికి చేయూతనిస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే దుర్గం చెరువును ఐటీ రహేజా కంపెనీ, ఖాజాగూడ లేక్ తదితర పది చెరువులను పలు సంస్థలు దత్తత తీసుకుని పరిరక్షణ, సుందరీకరణ పనులు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ పరిధిలో 25, హెచ్ఎండీఏ పరిధిలో 25 చెరువులను వివిధ నిర్మాణ రంగ సంస్థలు అభివృద్ధి-సుందరీకరణకు ముందుకు రావడంతో ప్రైవేటుపరంగానూ చెరువులు పునర్ వైభవాన్ని పొందనున్నాయి. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఖాజాగూడ లేక్ వద్ద ముందుకొచ్చిన 50 నిర్మాణ రంగ సంస్థలకు మంగళవారం సీఎస్ఆర్ ఒప్పంద పత్రాలను అందజేయనున్నారు. ఏకకాలంలో 50 చెరువుల దత్తత తీసుకోవడం ఓ బృహత్తర కార్యక్రమంగా నిలవనున్నది.