సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల వరకు భారీగా బదిలీలు చేస్తూ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి భద్రతల పోలీస్స్టేషన్ ఎస్హెచ్ఓల విషయంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని.. వారి గూర్చి పూర్తిగా పరిశీలించిన తర్వాతే పోస్టింగులు ఇచ్చినట్లు సీపీ వెల్లడించారు. ఈ బదిలీలలో 45 మంది ఇన్స్పెక్టర్లు, 34 మంది ఏఎస్సైలు, 49 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 119 మంది కానిస్టేబుళ్లు ఉన్నట్లు సీపీ తెలిపారు.
హెచ్ఆర్ఎంస్ (హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్) ఆధారంగా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్స్టేషన్లలో ఐదేండ్లు, లా అండ్ ఆర్డర్ జోన్లో ఏడేండ్లు విధులు పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్సైలను ఈ ఏడాది జూన్ నెలలో బదిలీ చేసిన విషయాన్ని సీపీ గుర్తు చేశారు. ఈ బదిలీ అయిన సిబ్బందిలో కొందరు డ్యూటీలో చేరగా, మరికొంత మంది అనారోగ్యం కారణంగా మరో ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరారు.
ఇలాంటి దరఖాస్తులను పరిగణలోకి తీసుకొని వారు కోరిన చోట పోస్టింగులు ఇచ్చినట్లు సీపీ తెలిపారు. అలాగే, ఎస్హెచ్ఓ, డీఐలు, ఇతర ఇన్స్పెక్టర్లు ప్రస్తుతం పనిచేస్తున్న చోట మూడేండ్లు పూర్తి చేసుకున్న వారిని తాజాగా బదిలీలు చేసినట్లు తెలిపారు. వివిధ స్థాయిలో పనిచేస్తున్న మొత్తం 247 మందిని బదిలీ చేసినట్లు తెలిపారు. ఎస్హెచ్ఓలుగా పోస్టింగ్ పొందిన వారికి గూర్చి పూర్తి వెరిఫికేషన్ చేసిన తర్వాతే పోస్టింగ్ ఇచ్చినట్లు సీపీ తెలిపారు. ఇన్స్పెక్టర్ల బదిలీలలో ఏడుగురు ఎస్హెచ్ఓలు, 8 మంది డిటెక్టివ్ ఇన్స్పెక్టర్లు, 10 మంది ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, వివిధ విభాగాల్లో పని చేస్తున్న మిగతా 20 మందికి పోస్టింగులు ఇచ్చినట్లు సీపీ వెల్లడించారు.