సిటీబ్యూరో: మహానగరంలో నిర్మాణ రంగం కుదేలవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో కళతప్పుతున్నది. 21 రోజుల్లో అనుమతులు విషయం అటుంచి.. నెలలు గడుస్తున్నా.. పర్మిషన్లు రాకపోవడంతో బిల్డర్లు డీలాపడిపోతున్నారు. అధికారులు రోజుకో నిబంధనలు పెడుతుండటంతో విసిగిపోతున్నారు. ఫలితంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కళకళలాడిన నిర్మాణ రంగం.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది.
కేసీఆర్ ప్రభుత్వంలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలో దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అనుమతి వచ్చేది. నెలకు సరాసరిగా జీహెచ్ఎంసీలో పది, హెచ్ఎండీఏ పరిధిలో 20 వరకు హైరైజ్డ్ బిల్డింగ్ (ఆకాశహర్మ్యాలకు) అనుమతులు దక్కేవి. ప్రస్తుతం మూడు నెలలు గడిచినా.. ఫైల్కు మోక్షం దక్కడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా.. జీహెచ్ఎంసీలో సుమారు రెండు, హెచ్ఎండీఏలో 6 వరకు ఎంఎస్బీలకు మాత్రమే అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఈ ఎంఎస్బీలు కూడా హెచ్ఎండీఏలో శంకర్పల్లి, జీహెచ్ఎంసీలో శేరిలింగంపల్లిలో మాత్రమే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎకరం వరకు మాత్రమే ఎంఎస్బీలకు అనుమతులు ఇస్తున్నారు. ఆపై ఎంఎస్బీలకు అనుమతులు రావాలంటే ప్రభుత్వ పెద్దల జోక్యం చేసుకుంటే తప్ప.. ఫైల్ ముందుకు కదలని పరిస్థితి.
వాస్తవంగా ఎంఎస్బీ సంబంధించి దరఖాస్తులను చాలా వరకు ఆఫ్లైన్లోనే పరిశీలించి అనుమతులు ఇస్తుంటారు. మ్యానువల్ (ఆఫ్లైన్)లో అన్ని అర్హతలు పొంది ఫీజులు కట్టి, ప్రొసిడింగ్ లేటర్ (ఫైనల్ అఫ్రూవల్) కాపీని సదరు బిల్డర్కు అందించాల్సిన అధికారులు తాజాగా ఆన్లైన్ అంటూ కొత్త కొర్రీలు పెట్టారు. మ్యానువల్గా వచ్చిన ఫైళ్లను మళ్లీ ఆన్లైన్ ద్వారా నోట్ కాపీతో పర్మిషన్ పెట్టుకోవాలని అధికారులు బిల్డర్లకు సూచిస్తున్నారు. దీంతో ఇప్పటికే నెలల తరబడి ఫైనల్ అఫ్రూవల్ కోసం ఎదురుచూసిన బిల్డర్లకు అధికారుల తాజా నిబంధనతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఈ క్రమంలోనే హెచ్ఎండీఏలో ఓ ఫైల్ అనుమతి కోసం అత్యున్నత స్థాయిలో కమిషనర్కు ఫోన్ చేయించినా.. తీరా కమిషనర్ మాత్రం రూల్ మారిందని, మ్యానువల్లో ఉన్న ఫైళ్లు అన్నీ ఆన్లైన్లో ద్వారా వస్తేనే ఇస్తామని తేల్చి చెప్పడం గమనార్హం. ఇక ఎంఎస్బీ కమిటీ నామ మాత్రమే వారి పనితీరు ఉంటోంది. కమిటీలో చాలా వరకు ఫైళ్లను ఏదో కారణం చూపుతూ తిరస్కరించుకుంటూ వస్తున్నట్లు బిల్డర్లు చెబుతున్నారు.
హెచ్ఎండీఏ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ బిల్డర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కమిషనర్ నుంచి ఫైల్ ఆమోదం పొందాలంటే తమ ఆదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందేనని బిల్డర్లు అంటున్నారు. ఈ ఇద్దరు కమిషనర్లు చాలా వరకు డిస్కస్, సైట్ విజిట్ (ఇన్స్పెక్షన్) పేరిట రోజుల తరబడి ఫైళ్లను తమ ఆధీనంలోనే పెట్టుకుంటున్నారు. బిల్డర్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా.. కమిషనర్లను కలిసే ప్రయత్నం చేసినా.. వారు సమయానికి దొరకడం లేదని చెబుతున్నారు. హెచ్ఎండీఏలో ఈ నెల 16న ఓ ఫైల్కు సంబంధించిన సైట్ విజిట్కు వస్తానని చెప్పిన కమిషనర్.. చివరకు సైట్ విజిట్ లేక సంబంధిత ఫైల్కు అనుమతి లభించలేదు.
కేసీఆర్ ప్రభుత్వంలో హైదరాబాద్ మహా నగరం విశ్వనగరంగా ఎదగడంలో ఐటీతో పాటు రియల్, నిర్మాణ రంగాలు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరాభివృద్ధి సరికొత్త పుంతలు తొక్కింది. కేసీఆర్ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో కల్పించిన మౌలిక వసతులతో అంతర్జాతీయ పెట్టుబడులు రావడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి. ఇందుకు అనుగుణంగా రియల్, నిర్మాణ రంగం శరవేగంగా ఎదిగింది.
దేశంలోని ఇతర మెట్రో నగరాలకు దీటుగా హైదరాబాద్ రియల్, నిర్మాణ రంగాల పురోగతి కనిపించింది. ప్రధానంగా ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా వంటి నగరాలకు లేని భౌగోళిక అనుకూలతలు హైదరాబాద్కు ఉండటంతో నిర్మాణ రంగం ఆకాశమే హద్దుగా దూసుకుపోయింది. వెస్ట్ కారిడార్కే పరిమితమయ్యే బహుళ అంతస్తుల భవనాలు (ఎంఎస్బీ) అన్ని వైపులా విస్తరించడంతో పాటు కోర్ సిటీలోనూ పాత నిర్మాణాలను కూల్చివేసి కొత్తగా ఆకాశహర్మ్యాలను నిర్మించే ట్రెండ్ కొనసాగింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ ద్వారా 2456 అనుమతులు లభించాయి. రూ. 1107.29 కోట్ల ఆదాయం సమకూరింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 16329 అనుమతులు లభించగా.. అందులో 2581 ఓసీ (అక్యూపెన్సీ సర్టిఫికెట్లు) ఉన్నాయి. తద్వారా రూ. 1454.76 కోట్ల ఆదాయాన్ని జీహెచ్ఎంసీ సమకూర్చుకున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే.. 2023-24లో రూ. 347.47 కోట్ల మేర ఆదాయాన్ని జీహెచ్ఎంసీ నిర్మాణ రంగ రూపంలో నష్టపోయింది. సకాలంలో అనుమతులు ఇవ్వకపోవడం, తరచూ కొర్రీలతో బిల్డర్లను ముప్పుతిప్పలు పెట్టడం, అనుమతులన్నీ నెలల తరబడి సర్కారు నిలిపివేయడం వంటి చర్యలతో నిర్మాణ రంగం తీవ్రంగా నష్టపోయిందని బిల్డర్లు వాపోతున్నారు.
బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి సంబంధించిన కీలకమైన సమావేశం శనివారం అమీర్పేటలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో జరిగింది. మెట్రోపాలిటన్ కమిషనర్ దాన కిశోర్ నేతృత్వంలో ప్లానింగ్ విభాగం ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. 10 అంతస్తుల పైబడి హెచ్ఎండీఏ పరిధిలో నిర్మించే బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు ఇచ్చే అంశంపై ప్రతి గురువారం ఈ కమిటీ సమావేశమై పలు అంశాలపై సమగ్రంగా చర్చించింది. ఎంఎస్బీల కేటగిరీలో వచ్చే దరఖాస్తు కమిటీ పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటికి ఆమోదం తెలుపుతుంది.
తాజాగా జరిగిన కమిటీ సమావేశంలో మొత్తం 50 ఎంఎస్బీలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించారు. ఇందులో 57 అంతస్తుల భవనానికి అనుమతినిచ్చినట్లు ప్లానింగ్ విభాగం అధికారి ఒకరు తెలిపారు. శివారు ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలతో పాటు భారీ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు పెరుగుతున్నాయని, వాటికి అవసరమైన మౌలిక వసతుల కల్పన, భవిష్యత్ పరిణామాలపై ఈ కమిటీ చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.