మూడు షిఫ్టుల్లో ఫోరెన్సిక్ వైద్యులు
ఉచిత రవాణాకు పార్థీవ వాహనాలు
ఎప్పటికప్పుడు మృతదేహాల అప్పగింత
ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్
సుల్తాన్బజార్, జూన్ 16 : పోస్టుమార్టం నిర్వహించేందుకు ఫోరెన్సిక్ విభాగం అధికారులు 24గంటల పాటు అందుబాటులో ఉంటారని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ అన్నారు. గురువారం దవాఖానలోని తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడానికి ఫోరెన్సిక్ వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండేవారని తెలిపారు. దీంతో ఈ రోజు పోలీసులు పంచనామా నిర్వహించిన మృతదేహాలకు మరుసటి రోజు పోస్టుమార్టం నిర్వహించాల్సిన పరిస్థితులు ఉండేదని చెప్పారు. అయితే భారత ప్రభుత్వ మార్గదర్శకాలు, ఆదేశాల మేరకు ఇక నుంచి 24 గంటల పాటు ఫోరెన్సిక్ వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు.