మహేశ్వరం, మార్చి 1 : పేదల ఆరోగ్యమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు మహేశ్వరం మండల కేంద్రంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి రోగులకు భరోసా కల్పిస్తున్నారు. సర్కారు దవాఖానలో అన్ని వసతులను కల్పిస్తుండటంతో రోగులు సర్కారు దవాఖానకు బాట పడుతున్నారు. రాష్ట్రంలో పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించేందుకు సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఒక అడుగు ముందుకు వేసి సర్కారు వైద్యానికి భరోసా కల్పిస్తూ మహేశ్వరంలో 24 గంటల పాటు డయాలసిస్ సేవలందిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో డయాలసిస్ కేంద్రాలు లేక ప్రజలు అనేక అవస్థలు పడ్డారని, డయాలసిస్ కేంద్రాలకు నగరంలో ఉండే ప్రధాన సెంటర్లకు వెళ్లాలంటే సమయం వృథా, డబ్బులు ఎక్కువగా ఖర్చులు అవుతుండేవని రోగులు అంటున్నారు.
నగరంలోని గాంధీ, ఉస్మానియా, మలక్పేట్, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లేవారని, గతంలో డయాలసిస్ చేయించుకోవాలంటే ఒకసారి ఒక్కొక్క వ్యక్తికి రూ.7వేల నుంచి రూ.10వేల ఖర్చు వస్తుండేదని రోగులు అంటున్నారు. గత పదేండ్ల నుంచి మహేశ్వరంలో డయాలసిస్ కేంద్రాన్ని నడుపుతున్నారు. ఈ డయాలసిస్ కేంద్రానికి ఒక రోజుకు 18 నుంచి 22 మంది రోగుల వరకు సేవలందిస్తున్నారు. నియోజకవర్గంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్య, వైద్యంపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మహేశ్వరం క్లస్టర్ డయాలసిస్లో 5 పడకలతో రోగులకు సేవలను అందిస్తున్నారు. ఒక్క డయాలసిస్ రోగికి 4 గంటల సమయం పడుతుందని టెక్నీషియన్లు అంటున్నారు.
ఒక రోగి కండీషన్ను బట్టి వారంలో 3 సార్లు తప్పకుండా డయాలసిస్ను చేయించుకోవాలని అంటున్నారు. ఈ కేంద్రంలో ఆర్వో వాటర్ ప్లాంటును డయాలసిస్ రోగులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మహేశ్వరం డయాలసిస్ కేంద్రానికి అమన్గల్, తలకొండపల్లి, షాద్నగర్, కొత్తూరు, నందిగామ, రాజేంద్రనగర్, కందుకూరు మండలాల నుంచి రోగులు వస్తుంటారు. ఈ రోగులకు ఒక రోజుకు 5 దఫాలల్లో డయాలసిస్ సేవలను అందిస్తున్నారు. మహేశ్వరం మండల కేంద్రంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి రోగులకు ఉచిత సేవలను అందిస్తుండటంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో రోగులు ఇబ్బందులు పడేవారు
మహేశ్వరం డయాలసిస్ కేంద్రంలో గతంలో వసతులు లేకుండా రోగులు అనేక ఇబ్బందులను ఎదుర్కొనేవారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ డయాలసిస్ రోగులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో వారందరికి తెలంగాణ ప్రభుత్వం పెన్షన్లను అందిస్తుంది. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో డయాలసిస్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మహేశ్వరంలో ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టం. రోగులకు ఖర్చు తగ్గుతుంది. జిల్లాలో ఇంకా కొన్ని డయాలసిస్ సెంటర్లను ప్రభుత్వం త్వరలోనే ఏర్పాటు చేయనున్నది.
– మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రోగులకు ఉచిత సేవలందిస్తున్నాం
ప్రభుత్వం మహేశ్వరంలో ఉన్న డయాలసిస్ రోగులకు ఉచితంగా మంచి సేవలను అందిస్తున్నాం. దవాఖానలో విద్యుత్, తాగునీరు, వసతులను కలిపించినైట్లెతే డయాలసిస్ రోగులకు ఇంకా మెరుగైన సేవలందిస్తాం. దవాఖానలో రోగుల అవసరం మేరకు టెక్నీషియన్లను ఏర్పాటు చేసి ఇంకా మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తాం. ఆరోగ్యశ్రీ, రేషన్కార్డు దారులందరికి ఉచితంగా సేవలను అందిస్తున్నాం. డయాలసిస్ బయట చేసుకుంటే ఒక్కొక్కరికి రూ. 7 నుండి రూ.10వేల వరకు ఖర్చు వస్తుంది. డయాలసిస్ కేంద్రాల్లో ప్రభుత్వం ఉచితంగా సేవలందిస్తుంది. మహేశ్వరం చుట్టు ఉన్న ప్రాంత ప్రజలు, రోగులు డయాలసిస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. – ఎం.కిషన్, క్లినికల్ ఆపరేషన్ క్లస్టర్ మేనేజర్
జనరేటర్లను ఏర్పాటు చేయాలి
ఇంకా కొంత మంది టెక్నీషియన్లను నియమించి దవాఖానలో జనరేటర్లను ఏర్పాటు చేయాలి. ఏడేండ్ల నుంచి డయాలసిస్ను చేయించుకుంటున్నాను. మూడేండ్లు హైదరాబాద్కు వెళ్లి డయాలసిస్ చేయించుకున్నాను. చాలా సమయం వృథా అయ్యింది. ఇప్పుడు మహేశ్వరం మండల కేంద్రంలో డయాలసిస్ సెంటర్ ఉండటంతో ఈ ప్రాంత ప్రజలకు, రోగులకు ఎంతో అనువుగా ఉంది. గతంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి డయాలసిస్ కేంద్రానికి వసతులను కల్పించారు. దవాఖానాలో డయాలసిస్ రోగుల కోసం ల్యాబ్లను, టాయ్లెట్లను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. సీఎం కేసీఆర్ డయాలసిస్ రోగులకు భరోసా కల్పించడం చాలా సంతోషం. – నర్సింహ, డయాలసిస్ రోగి