సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ)/మూసాపేట: గంజాయి తరలిస్తున్న ఐదుగురు నిందితులను కూకట్పల్లిలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్దనుంచి 230 కిలోల గంజాయి, రవాణాకు వినియోగించిన రెండుకార్లు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం కూకట్పల్లి పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ జోన్ డీసీపీ శ్రీనివాస్రావు, కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు. పాతబస్తీ కిషన్బాగ్కు చెందిన ఎండీ అఖిల్(26) గంజాయి రవాణాకు వాహనాలను అద్దెకు ఇస్తాడు. ఇందులో భాగంగానే జహీరాబాద్కు చెందిన అర్జున్కు తన ట్రాన్స్పోర్ట్ వాహనాల ద్వారా గంజాయి రవాణా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇదిలా ఉండగా.. మియాపూర్కు చెందిన హుడేకర్ విజయ్(27), మహ్మద్ అల్లావుద్దీన్ (22), అజిత్ వంశీ(24) ఒక ముఠాగా ఏర్పడి గంజాయి రవాణా చేస్తుంటారు. ఎండీ అఖిల్, అర్జున్ సూచన మేరకు ఈ ముఠా సభ్యులు ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ నుంచి జహీరాబాద్కు రెండు ఇన్నోవా కార్లలో గంజాయిని రవాణా చేస్తున్నారు. కూకట్పల్లి, మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు కూకట్పల్లి వై జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేయడంతో పాటు 230 కిలోల గంజాయి, వాహనాలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో కూకట్పల్లి ఇన్స్పెక్టర్ సురేందర్గౌడ్, డీఐ వెంకటేశం, అడ్మిన్ ఎస్సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.