గతంలో డీఎల్పీవో, డీపీవో, కలెక్టర్ అనుమతి తప్పనిసరి
పాత నిబంధనలతో అనుమతుల్లో జాప్యం.. అభివృద్ధి పనులపై ప్రభావం
జీపీలకు ఇక తొలిగిన ఇక్కట్లు..సర్వత్రా హర్షం
ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,574 గ్రామ పంచాయతీలు
పల్లెల వికాసానికి దోహదం
సిద్దిపేట,మార్చి 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామసీమల వికాసం, పూర్వవైభవమే లక్ష్యంగా పంచాయతీలకు ప్రభుత్వం అధికారాలను కట్టబెడుతున్నది. పంచాయతీలకు తగిన ఆర్థిక వనరులు సమకూరుస్తూ బలోపేతం చేస్తున్నది. గ్రామానికి వచ్చే నిధులను స్థానిక అవసరాలకు అనుగుణంగా పంచాయతీ పాలకవర్గాలు ఖర్చు చేసుకునేలా ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది. ఇందుకు సంబంధించిన జీవోను సైతం ఈనెల 26న విడుదల చేసింది. గతంలో పంచాయతీల్లో రూ.లక్ష నిధులు ఖర్చు చేయాలంటే డీఎల్పీవో అనుమతి, ఆపైన ఖర్చు చేయాలంటే డీపీవో, కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సి ఉండేది. దీనికి సమయం పట్టి అభివృద్ధి పనులపై ప్రభావం చూపేది. జీపీలకు పుల్ పవర్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో గ్రామసభ ఆమోదంతో ఎన్ని లక్షల రూపాయల విలువైన పనులైనా చేపట్టవచ్చు. తద్వారా పల్లెలు వడివడిగా ప్రగతి వైపు పయనించనున్నాయి.
గ్రామ పంచాయతీలకు పుల్ పవర్ ..గ్రామాలకు వచ్చే నిధులను స్థానిక అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామసభ ఆమోదంతో పం చాయతీ ఇచ్చే అనుమతితో ఎన్ని లక్షల రూపాయల విలువైన పనులైనా గ్రామాల్లో ఖర్చు చేయవచ్చు. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణ యం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 18ని విడుదల చేసింది. గ్రామానికి వచ్చే నిధులు స్థానిక అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేసుకోవచ్చు. గ్రామసభల ద్వారా పంచాయతీ పాలకవర్గం గ్రామాల్లో ప్రాధాన్యత క్రమంగా చేపట్టాల్సిన పనులను గుర్తించి, వాటికి తొలి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులను చేపడుతుంది. గతంలో ఉన్న నిబంధనలతో అనుమతుల్లో జాప్యం జరిగేది. దీంతో అభివృద్ధి పనులు, జీపీల నిర్వహణపై ప్రభావం పడేది. ఇక ఆ ఇబ్బందులు తొలిగిపోనున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో…
ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,574 గ్రామ పంచాయతీలు ఉన్నా యి. వీటిలో సిద్దిపేట జిల్లాలో 499, సంగారెడ్డి జిల్లాలో 647, మెదక్ జిల్లాలో 428 పంచాయతీలు ఉన్నాయి. గ్రా మాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా నిధులను గ్రామ పంచాయతీలకు అందిస్తుండడంతో గ్రామాలు పరిశుభ్రంగా తయారవుతున్నాయి. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు గ్రామ పంచాయతీలకు పూర్తి అధికారాలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 26న ఇందుకు సంబంధించిన జీవోను సైతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామ పంచాయతీకి వచ్చే నిధుల వినియోగం అధికారాన్ని జీపీ పాలకవర్గాలకే అప్పగించడంపై సర్పంచ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పంచాయతీల్లో రూ.లక్ష ఖర్చు చేయాలంటే డీఎల్పీవో అనుమతి, ఆపైన ఖర్చు చేయాలంటే డీపీవో, జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకునే వారు. ఇలా చేయడంతో అనుమతులు రావడం ఆలస్యమై పనులపై ప్రభావం చూపేది. గ్రామాలకు వచ్చే నిధుల వినియోగంలో ఉన్న ఇక్కట్లు ఇక తొలిగిపోయాయి అని చెప్పాలి. ఈ నిబంధనలను తొలగిస్తూ ..ప్రస్తుతం ఎంత వరకైనా పనులు చేసుకునే విధంగా పంచాయతీలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. నిధులకు తప్పనిసరిగా గ్రామసభ ఆమోదం పొం దాలని సూచించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో త్వరితగతిన పనులు జరిగే అవకాశం ఉంది.
అధికారుల పర్యవేక్షణ…
ఇక గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు పూర్తిగా పంచాయతీలకే అధికారం ఉంటుంది. అధికారుల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. గ్రామసభ ఆమోదానికి లోబడి పరిపాలనాపరమైనా అనుమతులు ఇవ్వడానికి పంచాయతీకి పూర్తి అధికారం ఉంది. పనుల అమలు, కొలత, సాంకేతిక అంశాలు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం నిబంధనల ప్రకారం చేపట్టాలి. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీలకు వచ్చే నిధులను ఖర్చు చేయడానికి అధికారం కలిగి ఉన్నాయని ఆ చట్టం చెబుతున్నది. పనుల నాణ్యత, ఏపని ఎంత వరకు చేయాలి..ఎంత ఖర్చు అవుతుంది అనే వివరాలను పంచాయతీరాజ్ అధికారుల పర్యవేక్షణలో జరుగుతాయి. పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తదితర నిధుల వినియోగంలో జాప్యం కాకుండా త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పంచాయతీ పాలక వర్గాలకే అధికారం కట్టబెట్టడంపై సర్పంచ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రగతివైపు పల్లెల పయనం…
2019 అక్టోబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది.ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రకృతి వనాలు, నర్సరీలు ఏర్పాటు చేశారు. హరితహారంలో విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్ను ప్రభుత్వం అందించింది.ఈ ట్రాక్టర్ ద్వారా ఇంటింటా చెత్త సేకరిస్తున్నారు. ప్రతి గ్రామం లో డంపింగ్యార్డు, వైకుంఠధామాలు నిర్మించారు. ప్రతినెలా గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులను విడుదల చేస్తున్నది. ఈ నిధులను జీపీలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. దీంతో ఇవ్వాళ పల్లెల రూపురేఖలు మారిపోయాయి.