సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల వేళ ఎన్నికల యంత్రాంగం నిఘాను మరింత పెంచింది. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ. 50 వేల నగదుకు మించి తీసుకువెళితే పట్టుకొని సీజ్ చేస్తున్నారు. సీజ్ చేసిన నగదుకు సంబంధించిన ఆధారాలను చూపితే తిరిగి అప్పగించే దిశగా జిల్లా గ్రీవెన్స్ కమిటీ చర్యలు తీసుకుంటున్నది.
ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి ఇప్పటి వరకు రూ.2.24 కోట్ల నగదు, రూ.32.91 లక్షల ఇతర వస్తువులు, 1045 లీటర్ల మద్యం, 61 మందిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి సోమవారం వరకు జిల్లాలో వివిధ ఎన్నికల ఎన్ఫోర్స్మెంట్ విభాగాల ద్వారా విస్తృతంగా తనిఖీలు నిర్వహించగా.. రూ.4.60 లక్షల నగదును పట్టుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
వీటితో పాటు రూ.3.06 లక్షల విలువ గల వివిధ రకాల వస్తువులను కూడా సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్వాడ్ ద్వారా రూ.3.45 లక్షల నగదు పట్టుకొని సీజ్ చేశామన్నారు. పోలీసుల ద్వారా రూ.1.15 లక్షల నగదు సీజ్ చేసినట్లు చెప్పారు. నగదు, ఇతర వస్తువుల రవాణాపై 22 ఫిర్యాదులు రాగా, వాటిని పరిశీలించి, పరిష్కరించినట్టు తెలిపారు. 20 ఎఫ్ఐఆర్లు, 360.90 లీటర్ల అక్రమ మద్యంను పట్టుకున్నామని, 20 మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ.. ప్రతి అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు ఆస్కారం ఉన్న ఏ విషయాన్ని కూడా విస్మరించడం లేదు. వ్యాపారం, వివిధ వస్తువుల కొనుగోళ్లు, బ్యాంకుల్లో నగదు జమ, ఇతర శుభకార్యాలు, అత్యవసర పనుల నిమిత్తం నగదు తీసుకువెళ్తూ అధికారులకు చిక్కుతున్నారు.
ఇలా తనిఖీల్లో పట్టుబడిన నగదు వివరాలను సంబంధిత అధికారులు గ్రీవెన్స్ కమిటీకి చేరవేస్తున్నారు. సదరు సొమ్ము తిరిగి ఇవ్వాలని బాధితులు గ్రీవెన్స్ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. నగదును అవసరాల నిమిత్తం తీసుకువెళ్తున్నట్లు నిర్ధారణకు వచ్చిన తర్వాతే.. తిరిగి ఆ నగదును ఇచ్చేందుకు రిలీజింగ్ ఆర్డర్ (ఆర్వో) ఇస్తున్నారు. జాప్యం లేకుండా సరైన పత్రాలు ఉంటే ఆర్ఓ ఇస్తున్నారు. సదరు ఆర్ఓను గ్రీవెన్స్ కమిటీ, ఠాణా ఎస్హెచ్ఓ, రిటర్నింగ్ అధికారి సంబంధిత బాధితుడికి అందజేస్తున్నారు.