సిటీబ్యూరో, జూన్ 27(నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జిల్లాలో వచ్చే నెల మొదటివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గ్రూప్-4 రాత పరీక్షలను సజావుగా నిర్వహించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రూప్-4 పరీక్షల నిర్వహణ అంశంపై మంగళవారం వనితా మహా విద్యాలయంలో సంబంధిత జిల్లా అధికారులతో అడిషనల్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 59,604 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని, అందుకోసం 173 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు పేపర్-2 పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
పరీక్షల హాజరు కావడం కోసం కావాల్సిన హాల్ టిక్కెట్ల డౌన్లోడ్ ప్రక్రియ టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా ప్రారంభమైందన్నారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాలను ఒక రోజు ముందుగానే శానిటైజ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉదయం 8 గంటల నుంచి 9.45 గంటలకు, మధ్యాహ్నం 1 గనుంచి 2.15 వరకు పరీక్ష కేంద్రాల్లోని అనుమతిస్తామన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 48 రూట్ ఆఫీసర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీ బాబురావు మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వల్ల 144 సెక్షన్ విధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సూర్యలత, సిటీ సెక్యూరిటీ ఆఫీసర్ అలెక్స్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.