సుల్తాన్బజార్, డిసెంబర్ 15 : పేదలు ఆకలితో అలమటించవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరికి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం అందిస్తున్నది. ఆ బియ్యం కొందరు దళారుల మూలంగా పక్కదారి పడుతున్నది. రేషన్ దుకాణాల్లో కొనుగోలు చేసిన బియ్యాన్ని కొందరు ఇంటి వద్దకు వచ్చే ముగ్గుల విక్రయదారులకు అమ్ముకుంటున్నారు. వారు దళారులకు అప్పగిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు కుల్సుంపురా పోలీసులు జియాగూడలోని ఓ గోదాంపై దాడి చేశారు. ఈ మేరకు ఎస్ఐ సాయిశ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జియాగూడ డోర్బస్తీకి చెందిన జయరాం అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచి విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి లింగరాజు, గంగరాజు, సాయికుమార్లను పట్టుకొని సుమారు 17 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని పౌర సరఫరాల శాఖ సిబ్బందికి అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.