సిటీబ్యూరో, జూలై 15(నమస్తే తెలంగాణ): వ్యర్థాల నుంచి వెలుగులు ప్రసరిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో మరొకటి అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే జవహర్నగర్ డంపింగ్ యార్డులో 20 మెగావాట్ల ప్లాంటు అందుబాటులోకి రాగా.. దుండిగల్లో 14.5 మెగావాట్ల సామర్థ్యంతో మరో ప్లాంటు ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ప్లాంటు అందుబాటులోకి వస్తే నగరంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల సామర్థ్యం 34.5 మెగావాట్లకు చేరుకుంటుంది. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి మరో నాలుగు ప్లాంట్లు అందుబాటులోకి రానుండగా, నగరంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల సామర్థ్యం ఏకంగా 101 మెగావాట్లకు చేరుకోనుందని శనివారం పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.
వ్యర్థాల నుంచి వెలుగులు ప్రసరింపజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లలో మరొకటి త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే జవహర్నగర్ డంపింగ్ యార్డులో 20 మెగావాట్ల ప్లాంటు అందుబాటులోకి రాగా, త్వరలో దుండిగల్లో 14.5 మెగావాట్ల సామర్థ్యంతో మరో ప్లాంటు అందుబాటులోకి రానుందని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరక శనివారం ట్విట్టర్లో దుండిగల్ ప్లాంటు ఫొటోలను జత చేస్తూ, వ్యర్థాల నుంచి సంపదను సృష్టించాలని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లను చేపట్టిందని స్పష్టం చేశారు. దుండిగల్లో జీహెచ్ఎంసీ చేపట్టిన ఈ ప్లాంటు త్వరలో అందుబాటులోకి రానున్న దరిమిలా నగరంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల సామర్థ్యం 34.5 మెగావాట్లకు చేరుకుంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది డిసెంబరు నాటికి మరో నాలుగు ప్లాంట్లు అందుబాటులోకి వచ్చి సామర్థ్యం ఏకంగా 101 మెగావాట్లకు చేరుకోనుందని పేర్కొన్నారు.
ఒక్కొక్కటిగా ‘వేస్ట్ టు ఎనర్జీ’..
గతంలో నిత్యం ఉత్పత్తి అయ్యే చెత్తను జవహర్నగర్ డంపింగ్ యార్డుకు తరలించి, శాస్త్రీయ పద్ధతుల్లో యార్డును నిర్వహించడమే గగనంగా ఉండేది. ఆ ప్రక్రియ సక్రమంగా లేకపోవడం వల్లనే జవహర్నగర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఏండ్ల తరబడి కాలుష్య నరకాన్ని అనుభవించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత డంపింగ్ యార్డును శాస్త్రీయత పద్ధతుల్లో నిర్వహించడమే కాకుండా, భూగర్భ జలాల పరిరక్షణతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. ఇంకా మరో అడుగు ముందుకేసి, చెత్త నుంచి కరెంటును ఉత్పత్తి చేసే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను కూడా ఒక్కొక్కటిగా ఏర్పాటు చేస్తుంది. విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను సెకండరీ కలెక్షన్, ట్రాన్స్ఫర్ పాయింట్స్ (ఎస్సీటీపీ) నుంచి వ్యర్థాలను జవహర్ నగర్ డంప్ యార్డుకు తరలిస్తారు.
తరలించిన వెంటనే అకడ యాంత్రికంగా సెగ్రిగేట్ చేసిన తర్వాత మండే గుణం గల వ్యర్థాలను వేరు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. తద్వారా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటుకు ఆ చెత్తను తరలించి కరెంటును ఉత్పత్తి చేస్తారు. ఇందులో భాగంగా ఇప్పటికే జవహర్నగర్ డంపింగ్ యార్డులో 20 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంటు అందుబాటులోకి వచ్చింది. తాజాగా దుండిగల్లోనూ 14.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంటు పనులు పూర్తయ్యాయి. అయితే, ఇది త్వరలో అందుబాటులోకి రానున్నదని ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ ప్లాంటులో రోజుకు 1500 టన్నుల చెత్త ద్వారా 800 టన్నుల ఆర్డీఎఫ్ (రెఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్) ఉత్పత్తి అవుతుందని పేర్కొన్నారు. కాగా, జవహర్నగర్ డంపింగ్ యార్డులోనే ఫేజ్-2 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటు నిర్మాణం 28 మెగావాట్ల సామర్థ్యంతో జరుగుతున్నది. దీంతో పాటు ఫ్యారానగర్లో 15 మెగావాట్లు, యాచారంలో 12 మెగావాట్లు, బీబీ నగర్లో మరో 11 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ల నిర్మాణం జరుగుతున్నది. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ఇవన్నీ అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల సామర్థ్యం 101 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చేరుకోనుంది.