శివారు మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారించింది. నగరానికి సమీపంలో ఉన్న శివారు మున్సిపాలిటీలలో ప్రజల రవాణా సౌకర్యం మెరుగుపరుస్తూ.. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా లింక్ రోడ్లను ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు హెచ్ఆర్డీసీఎల్ రూ. 417 కోట్ల నిధులను మంజూరు చేసింది. శివారు మున్సిపాలిటీలైన దమ్మాయిగూడ, నాగారం, ఘట్కేసర్, పోచారం, జవహర్నగర్ల పరిధిలో 13 రోడ్లను 33.35 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు.
మేడ్చల్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలకు రవాణ సౌకర్యం మెరుగుపర్చేలా హైదరాబాద్తో పాటు ఔటర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా లింక్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దమ్మాయిగూడ, నాగారం, ఘట్కేసర్, పోచారం, జవహర్నగర్లలో 13 లింకు రోడ్లను 33.35 కిలోమీటర్ల మేర నాలుగు నుంచి ఆరు లైన్లకు విస్తరించనునున్నారు. ఈ రోడ్ల నిర్మాణానికి హెచ్ఆర్డీసీఎల్ రూ.417 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీంతో 13 రోడ్లకు 33.35 కిలోమీటర్ల రోడ్లను నిర్మించనున్నారు. ఇందుకుగాను తర్వలోనే టెండర్లను ఆహ్వానించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ లింక్ రోడ్ల నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్య అధిగమించి శివారు ప్రాంతాలలో నివసించే ప్రజలకు రవాణ సౌకర్యం మెరుగు పడనున్నది.
త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శివారు ప్రాంత మున్సిపాలిటీల పరిధిలో లింకు రోడ్ల నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల రవాణ సౌకర్యాలను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఓఆర్ఆర్ రోడ్డుకు అనుసంధానం చేసేలా రూ.417 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. త్వరలోనే టెండర్ల పక్రియను పూర్తి చేయనున్నారు. టెండర్లు పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. జిల్లాలోని మిగతా మున్సిపాలిటీలకు త్వరలోనే ప్రభుత్వం నిధులను మంజూరు చేయనున్నది.
– రాష్ట్రకార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి