అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) ;స్వరాష్ట్రంలో దేశ, విదేశీ పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామంగా మారింది. ఔటర్ చుట్టూ పరిశ్రమలతో జిల్లా ఉపాధి హబ్గా అవతరించింది. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పనతో పారిశ్రామిక ప్రగతి ఎల్లలు లేకుండా విస్తరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పారదర్శకమైన ‘టీఎస్ఐపాస్’విధానంతో పారిశ్రామిక రంగంలో అద్భుతాలను స్పష్టిస్తున్నది. 9 ఏండ్లలోనే మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 62,690.48 కోట్ల పెట్టుబడులతో 12,862 పరిశ్రమలు ఏర్పాటు చేసి, ఏకంగా 7, 42,790 మందికి ఉపాధి కల్పించింది. మరిన్ని పరిశ్రమలు ప్రారంభదశలో ఉండటంతో ఎంతోమందికి ఉపాధి లభించనుంది.
స్వరాష్ట్రంలో హైదరాబాద్ ఉపాధి హబ్గా మారింది. దేశ, విదేశీ పెట్టుబడులకు స్వర్గధామమైంది. ఔటర్ చుట్టూ అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పనతో పారిశ్రామిక ప్రగతి ఎల్లలు లేకుండా విస్తరిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘టీఎస్ఐపాస్’ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో అద్భుతాలను స్పష్టిస్తున్నది. నలు దిశలా ఏర్పాటవుతున్న పరిశ్రమలతో యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కేవలం 9 ఏండ్లలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రూ. 62,690.48 కోట్ల పెట్టుబడులతో 12, 862 పరిశ్రమలు ఏర్పాటవ్వగా, ఏకంగా 7,42,790 మందికి ఉపాధి లభించింది. భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు రానుండటంతో యువతలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పెట్టుబడుల వెల్లువ..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రంగారెడ్డి జిల్లాలో కేవలం 3వేల 328 కోట్ల పెట్టుబడులతో 2,777 పరిశ్రమలు మాత్రమే ఏర్పాటయ్యాయి. అప్పట్లో కేవలం 45,763 మందికి మాత్రమే ఉపాధి కల్పించబడింది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలిరావడంతో ప్రస్తుతం జిల్లాలో 47 వేల 62 కోట్ల పెట్టుబడులతో 1,252 పరిశ్రమల ఏర్పాటు ద్వారా 5,15,851 మందికి ఉపాధి పొందుతున్నారు. ప్రముఖ సంస్థలైన ఫాక్స్ కాన్, గూగుల్, బోయింగ్, విప్రో, ప్రీమియర్ ఎనర్జీస్, రేడియంట్, ఓరియంట్, ఆస్ట్రల్ వంటి పరిశ్రమలు ఏర్పాటై వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. మారుమూల ప్రాంతమైన చందన్వెల్లి నేడు పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఇక్కడి ఇండస్ట్రియల్ పార్కులో ఐదేండ్లలోనే రూ.13,508కోట్ల పెట్టుబడులతో 40 పరిశ్రమలు ఏర్పాటై 3,210 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. వెల్స్పన్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఓలెక్ట్రా గ్రీన్టెక్, దైఫుకు, నికోమాక్ తైకిషా, కిటెక్స్ వంటి మెగా ప్రాజెక్టులు ఈ ప్రాంతంలోనే కొలువుదీరాయి. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీల్లో ఒకటైన మేధా సంస్థ కొండగల్ వద్ద రూ.650కోట్ల పెట్టుబడితో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఉత్పత్తులను సైతం మొదలుపెట్టడం విశేషం.
ఇదీ రంగారెడ్డి ముఖచిత్రం..
తొమ్మిదేండ్ల కాలంలో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ, మధ్యతరహా, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమలు 1,252 ఏర్పాటవ్వగా.. వీటితో ప్రత్యక్షంగా 5,15,851 మంది ఉపాధి పొందుతున్నారు. ఉపాధి అవకాశాల్లో పారిశ్రామికవేత్తలు స్థానికులకే ప్రాధాన్యత ఇస్తుండగా..ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చిన కార్మికులు సైతం ఉపాధి పొందుతున్నారు.
కొత్తగా మరో 19 ఇండస్ట్రియల్ పార్కులు
రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 16 ఇండస్ట్రియల్ పార్కులు ఉండగా..మరో మూడు పార్క్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. రావిర్యాల(ఈ-సిటీ), మహేశ్వరంలోని రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లు, ఇబ్రహీంపట్నంలో ఫైబర్ గ్లాస్ కాంపోజిట్ క్లస్టర్, ముచ్చర్ల ఫార్మాసిటీ, చందన్వెల్లి ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటయ్యాయి. 19,333 ఎకరాల్లో రూ.63వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఫార్మాసిటీ ద్వారానే లక్ష మందికి పైగా ఉపాధి లభించనున్నది. సరుకు రవాణా సౌకర్యం కోసం బాట సింగారం, మంగళ్పల్లి వద్ద కొత్తగా లాజిస్టిక్ పార్కులు ఏర్పాటయ్యాయి. అయితే జిల్లాలో కొత్తగా మరో 19 ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీఎస్ఐఐసీ) అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసింది. భూ సేకరణ కోసం జిల్లా కలెక్టర్కు ప్రతిపాదనలు సైతం పంపించింది. భూసేకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే దశలవారీగా ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. ఉద్యోగులకు నైపుణ్య శిక్షణా కేంద్రం వంటివి టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే ఈ పార్కుల ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
మేడ్చల్లో త్వరలో రానున్న పరిశ్రమలు ఇవి…
హాస్పిటల్ అండ్ హెల్త్ ఇండస్ట్రి, శామీర్పేట్లో అమ్యూజ్మెంట్ అండ్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రి, కీసరలో నాలెడ్డ్ అండ్ సైన్స్, ఘట్కేసర్లో ఐటీ అండ్ ట్రాన్స్పోర్ట్ సేకరణకు టీఎస్ఐఐసీ ఏర్పాట్లు మేడ్చల్ జిల్లాలో అనేక మంది పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్న క్రమంలో టీఎస్ఐఐసీ భూ సేకరణ చేసి పారిశ్రామికవాడలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే జిల్లాలోని మాదారంలో 225 ఎకరాల్లో పారిశ్రామకవాడను తీర్చిదిద్దే పనిలో ఉండగా మరిన్ని భూములను సేకరించి పారిశ్రామికవాడలను ఏర్పాటు చేయనున్నారు. మేడ్చల్, కీసర, పోచారం, బోడుప్పల్, చెంగిచెర్ల పరిధిలో భూ సేకరణకు చర్యలు చేపట్టింది. జిల్లాలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్ఐఐసీలో 5,603 మంది పారిశ్రామికవేత్తలు దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలోనే మేడ్చల్-మల్కాజిగిరి అత్యధిక పరిశ్రమలు ఉన్న జిల్లాగా నంబర్వన్ స్థానంలో నిలిచింది. రాష్ట్రం ఏర్పాడిన నాటి నుంచి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఇప్పటి వరకు 11,610 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. రూ. 15, 628,29 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 2, 26, 939 మందికి ఉపాధి లభించింది. జిడిమెట్ల, బాలానగర్, కూకట్పల్లి, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, కుషాయిగూడ, చర్లపల్లి, మౌలాలి, శామీర్పేట్, మేడ్చల్ ప్రాంతాల్లో పరిశ్రమలు ఉన్నాయి. ప్రధానంగా విత్తన కంపెనీలు, అటోమ్బైల్స్, ఫుడ్ ప్రొడక్షన్, ఫ్యాబ్రికేషన్, ఫార్మా తదితర కంపెనీలు ఏర్పడ్డాయి.
అన్నింట్లోనూ అగ్రగామిగా..