మియాపూర్, నవంబర్ 21 : దైనందిన కార్యకలాపాలతో ఒత్తిడికి గురవుతున్న ప్రజలకు చక్కని ఆహ్లాదాన్నందించేందుకు పార్కులు సిద్ధం అవుతున్నాయి. వారాంతంలో సేద తీరేందుకు హాల్స్.. మాల్స్కు పరుగులు తీస్తున్న ప్రజానికాన్ని విభిన్నమైన పార్కుల వైపు అడుగులేయించే దిశగా శేరిలింగంపల్లి జోన్లో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పచ్చదనం పరుచుకుని.. ఆలోచనాత్మకంగా థీమ్ పార్కులు సిద్ధం అవుతున్నాయి. శేరిలింగంపల్లి జోన్లో ఐటీ పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఉండగా.. వేలాది ఐటీ ఉద్యోగులు సహా ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి సైతం ఉన్న నేపథ్యంలో.. అబ్బుర పరిచేలా థీమ్ పార్కులు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రధానంగా రోజువారీ పార్కుల్లా కాకుండా వైవిధ్యంగా తయారవుతున్న అవి ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటాయని అధికారులు పేర్కొంటున్నారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో 12 థీమ్ పార్కులు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు సిద్ధం అవుతున్నాయి. సాంకేతిక టెండర్ ప్రక్రియ, అంతర్గతంగా నిర్మాణ పనులు.. పచ్చదనం.. వాకింగ్ ట్రాక్లు చిన్నారుల క్రీడాస్థలాలు సహా విభిన్నత్వంతో వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నది అధికారుల యోచన.
ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న థీమ్ పార్కులు..
శేరిలింగంపల్లి జోన్లోని నాలుగు సర్కిళ్లుండగా.. 12 థీమ్ పార్కుల నిర్మాణాన్ని చేపడుతున్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో సివిల్ సహా పచ్చదనం పనులను చేపట్టేలా ముందుకు సాగుతున్నారు. ప్రజలకు ఆహ్లాదం పంచేలా పచ్చదనం.. చిన్నారులకు ఉత్సాహాన్నిచ్చేలా క్రీడా పరికరాలు .. హాయిగా సేదదీరేలా కూర్చునేందుకు చక్కనైన ఆకర్షనీయమమైన బల్లాలు సహా ఇతర సౌకర్యాలతో పార్కులు సిద్ధం అవుతున్నాయి. మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరీనగర్లో అన్ని వయస్సుల వారికి ఉపయోపడేలా(ఎంజెన్)పేరిట నిర్మిస్తున్న థీమ్ పార్కు పనులు 80 శాతానికి పైగా పూర్తయ్యాయి.
గచ్చిబౌలి పత్రికానగర్లో ఆలోచనాత్మకంగా ఉండేలా సైన్స్ పార్కు నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పటాన్చెరు సర్కిల్ పరిధిలో గాంధీ పార్కు ఇప్పటికే ప్రారంభమై ప్రజలకు అందుబాటులోకి రాగా.. అదేసర్కిల్ పరిధిలోని సాయినగర్ కాలనీలో సింహభాగం థీమ్ పార్కు పనులు పూర్తయ్యాయి. నలగండ్ల, హుడా కాలనీ, చందానగర్, మైత్రినగర్, సాయినగర్, టీఎన్జీవోస్ కాలనీ సహా ఇతర ప్రాంతాలలో థీమ్ పార్కు నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మొత్తం 12 పార్కులకు గాను 5 థీమ్ పార్కుల పనులు తుది దశకు చేరుకున్నాయి. కొన్ని టెండర్ దశను పూర్తి చేసుకుని ప్రారంభదశలో ఉన్నాయి. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య ఎప్పటికప్పుడు థీమ్ పార్కు పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించటంతో పాటు ఇంజినీరింగ్, బయోడైవర్సిటీ విభాగాలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. పనులలో జాప్యం లేకుండా చూడాలని సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులకు సూచిస్తున్నారు.