కేపీహెచ్బీ కాలనీ, జూన్ 15 : ప్రజలకు పారదర్శకమైన.. సత్వర సేవలందించాలన్న లక్ష్యంతో జీహెచ్ఎంసీలో పరిధిలో శుక్రవారం నుంచి వార్డుస్థాయి పాలన మొదలు కానున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ ఆలోచనతో వార్డుస్థాయి పరిపాలనకు అడుగులు పడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో జోన్, సర్కిల్స్థాయిలో పాలన కొనసాగుతుండగా.. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు సర్కిల్ కార్యాలయాలకు వెళ్లి సేవలు పొందేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అధికారులను కలవాలన్నా, సమస్యలపై ఫిర్యాదులు చేయాలన్నా.. ఆ ఫిర్యాదులకు సంబంధిత అధికారులు స్పందించాలన్నా కాలయాపన జరుగుతుంది. ఈ సమస్యలను పరిష్కరించే దిశగా చేపట్టిన వార్డుస్థాయి పాలన శుక్రవారం నుంచి ప్రారంభమవుతుండటంతో ప్రజలకు మరింత చేరువగా సేవలు అందనున్నాయి. దీనిలో భాగంగా కూకట్పల్లి జంట సర్కిళ్ల పరిధిలో 11 వార్డు కార్యాలయాలు ముస్తాబు కాగా, శుక్రవారం ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్కుమార్, ఆయా డివిజన్ల కార్పొరేటర్ల చేతుల మీదుగా వార్డు పాలన ప్రారంభం కానున్నది.
ఒక వార్డు ఆఫీసులో.. 10 విభాగాలు..
కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో 11 వార్డులు ఉండగా.. 11 వార్డు కార్యాలయాల్లో వార్డు పాలన శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నది. మూసాపేట సర్కిల్లో 5 వార్డులు, కూకట్పల్లి సర్కిల్లో 6 వార్డుల్లో ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. ఒక్కో వార్డు కార్యాలయంలో 10 విభాగాలకు చెందిన అధికారులు అందుబాటులో ఉంటారు. ఒక వార్డు ఆఫీసులో వార్డు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, వార్డు ఇంజినీర్, వార్డు టౌన్ప్లానర్, వార్డు కమ్యూనిటీ ఆర్గనైజర్, వార్డు శానిటరీ జవాన్, వార్డు యూబీడీ సూపర్వైజర్, వార్డు ఎంటమాలజిస్ట్, వార్డు జలమండలి సిబ్బంది, వార్డు విద్యుత్ సిబ్బందితోపాటు కంప్యూటర్ ఆపరేటర్ కమ్ రిసెప్షనిస్ట్ సేవలందిస్తారు. వార్డు కార్యాలయంలో ఆయా విభాగాలకు నేమ్ బోర్డుతోపాటు టేబుల్, కుర్చీలను ఏర్పాటు చేశారు. వార్డు ఆఫీసులో ఇంటర్నెట్ సౌకర్యం, ప్రజల కోసం బెంచీలు, మరుగుదొడ్లు, మూత్రశాలలను ఏర్పాటు చేశారు. వార్డు కార్యాలయం ముందు ఏ సమస్యను ఎవరికి చెప్పాలి.. ఎన్ని రోజుల్లో ఆ సమస్య పరిష్కారమవుతుందో తెలిపేలా సిటిజన్ చార్టును ఏర్పాటు చేశారు.
మూసాపేట సర్కిల్లో వార్డు ఆఫీసులు
డివిజన్ కొత్త వార్డు ఆఫీస్
కేపీహెచ్బీ కాలనీ కాలనీ 3వ ఫేజ్ వార్డు కార్యాలయం
బాలాజీనగర్ బాలాజీనగర్లోని వార్డు కార్యాలయం
అల్లాపూర్ వివేకానందనగర్లోని వార్డు కార్యాలయం
మూసాపేట మోతీనగర్లోని మీసేవ బిల్డింగ్ మొదటి అంతస్తు
ఫతేనగర్ పోచమ్మ దేవాలయం పక్కన వార్డు కార్యాలయం
కూకట్పల్లి సర్కిల్లో..
డివిజన్ కొత్త వార్డు ఆఫీస్
ఓల్డ్ బోయిన్పల్లి బోయిన్పల్లి లాస్ట్ బస్టాప్ వార్డు కార్యాలయం
బాలానగర్ గ్రామంలోని వార్డు కార్యాలయం
కూకట్పల్లి బాగ్అమీర్లోని వార్డు కార్యాలయం
హైదర్నగర్ సమతానగర్లోని కమ్యూనిటీ హాల్
ఆల్విన్కాలనీ శంషీగూడలోని వార్డు కార్యాలయం
సమస్యలను సత్వరమే పరిష్కరించేలా వార్డుపాలన : జడ్సీ మమత
కాలనీలు, బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు వార్డుస్థాయి పాలన సాగుతుందని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. గురువారం కూకట్పల్లి జంట సర్కిళ్ల కార్యాలయంలో 11 వార్డులకు చెందిన కార్పొరేటర్లతో వార్డుస్థాయిలో పనిచేసే అధికారులకు పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్సీ మమత మాట్లాడుతూ.. అధికారుల వికేంద్రీకరణలో భాగంగా పౌరుల వద్దకే పరిపాలనను తీసుకురావడం జరుగుతుందన్నారు. వార్డుస్థాయిలో అధికారులు ప్రజల సమస్యలను తెలుసుకోవాలని, మర్యాదగా మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించాలన్నారు. ఆయా విభాగాలకు చెందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు చేయాలన్నారు. వార్డు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్తోపాటు మిగితా విభాగాల అధికారులు, సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్రావు, శిరీషాబాబురావు, సబీహాబేగం, సతీశ్ గౌడ్, రవీందర్రెడ్డి, నర్సింహ యాదవ్, మహేందర్, నార్నె శ్రీనివాస్రావులతోపాటు ఎస్ఈ చిన్నారెడ్డి, డీసీలు రవికుమార్, రవీందర్కుమార్, ఈఈలు సత్యనారాయణ, గోవర్ధన్ గౌడ్, డీడీ పార్క్స్ పద్మనాభం, ఏఎంసీ శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.