సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ ) : మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. పరీక్ష సమయం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుందన్నారు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 361 (రెగ్యులర్ 349, ప్రైవేట్ 12) పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. మొత్తం 76,575 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో బుధవారం సమీక్ష నిర్వహించారు.
పరీక్షలు నిర్వహించే సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన పోలీసు బందోబస్తు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్. రోహిణి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జే.నర్సింగ్రావు, బి. నరసింహ, జరీన్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.