SSC Exams | మేడ్చల్, మార్చి16(నమస్తే తెలంగాణ): ఈ నెల 18 నుంచి వచ్చే నెల 2 వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి 46, 834 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. జిల్లాలో 231 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12: 30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను పాఠశాలలకు చేరవేశారు. లేదా www.bse,telangana.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఉదయం 8: 35 నిమిషాల వరకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని మేడ్చల్ జిల్లా విద్యాధికారి విజయకుమారి సూచించారు. పరీక్షా కేంద్రాలకు మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని తెలిపారు. 24,034 మంది బాలురు, 23,372 మంది బాలికలు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.