చిక్కడపల్లి, అక్టోబర్ 7 : వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా చేరువై దేశానికే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) ఆదర్శంగా నిలిచిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు. బాగ్లింగంపల్లిలోని టీఎస్ ఆర్టీసీ కళాభవన్లో శనివారం శ్రావణమాసం, రాఖీ పౌర్ణమి చాలెంజ్లతో పాటు జోనల్ స్థాయి ఉత్తమ ఉద్యోగులు, ఎక్స్ ట్రా మైల్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ హాజరై ఉత్తమ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా రాఖీ పౌర్ణమి చాలెంజ్, శ్రావణ మాసం చాలెంజ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రీజియన్లకు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ గత రెండేళ్లలో సంస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు.
క్లిష్ట పరిస్థితులను తట్టుకొని తన కాళ్ల మీద తాను నిలబడగలిగే స్థాయికి సంస్థ ఎదగడం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. సంస్థ అందించిన ప్రతి చాలెంజ్ను సిబ్బంది విజయవంతం చేశారన్నారు. రాఖీ పౌర్ణమికి రికార్డు స్థాయిలో ఒక్క రోజులో రూ.22.65 కోట్ల రాబడి రావడం గొప్ప విషయమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఇంత మొత్తంలో ఆదాయం రాలేదని తెలిపారు. దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతితో పాటు శుభముహుర్థాలు వస్తున్నాయని, రాబోయే 100 రోజులు సంస్థకు ఎంతో కీలకమని చెప్పారు. నవంబర్, డిసెంబర్లో 1000 కొత్త డీజిల్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్, కృష్ణకాంత్, పురుశోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్కుమార్, రఘునాథరావు, సీఎఫ్ఎం విజయ పుష్ఫ, సీసీవోఎస్ విజయ భాస్కర్, సీసీ ఈ రాంప్రసాద్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
రాఖీ పౌర్ణమి చాలెంజ్లో..
శ్రావణ మాసం చాలెంజ్లో..