సిటీబ్యూరో, సెప్టెంబరు 29 (నమస్తే తెలంగాణ ) : దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా నూతన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా.. పనులు పూర్తయిన చోట ఒక్కొక్కటిగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 31 ఎస్టీపీల పనుల్లో ఇప్పటికే కోకాపేట, దుర్గం చెరువులో అందుబాటులోకి తీసుకువచ్చారు. వచ్చే నెలలో 5వ తేదీలోగా మరిన్ని చోట్ల ఎస్టీపీలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 31 ఎస్టీపీలను అక్టోబరు నెలాఖరు నాటికల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పనులను వేగిరం చేశారు.
ఇందులో భాగంగానే అంబర్పేట (రోజుకు 21.2 కోట్ల లీటర్లు ), నల్లచెరువు (రోజుకు 8.65 కోట్ల లీటర్లు), పెద్ద చెరువు (రోజుకు 1.75 కోట్ల లీటర్లు), సఫిల్గూడ ( రోజుకు 55లక్షల లీటర్లు ), మిరాలం (రోజుకు 4.15 కోట్ల లీటర్లు), నాగోల్ (రోజుకు 32 కోట్ల లీటర్లు ), ఫతేనగర్ (రోజుకు 13. 3 కోట్ల లీటర్లు), ఖాజాకుంట (రోజుకు 2 కోట్ల లీటర్లు ), వెన్నెలగడ్డ (రోజు కోటి లీటర్లు), మియాపూర్ పటేల్ చెరువు (రోజుకు 70 లక్షల లీటర్లు ) ఎస్టీపీ పనులు తుది దశకు చేరుకున్నాయి. రెండు షిఫ్టుల్లో పనిచేస్తూ పనులు వేగంగా జరుపుతున్నారు. రాత్రివేళల్లో పనులు చేయడానికి వీలుగా లైటింగ్ ఏర్పాటు చేశారు. సివిల్ పనులు పూర్తయిన ఎస్టీపీల్లో ఎలక్ట్రో మెకానిక్ సామగ్రి బిగింపు పనులు చేపడుతున్నారు. వీటితో పాటు సుందరీకరణకు గార్డెనింగ్, ల్యాండ్స్కేప్ పనులు ముమ్మరం చేశారు. వచ్చే రెండు , మూడు రోజుల్లో ట్రయల్ రన్ పనులు చేపట్టి 5వ తేదీలోగా ప్రారంభానికి సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.