హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలోని జియాగూడలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ ఘటనలో బాలిక మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత జియాగూడ వెంకటేశ్వరనగర్లోని ఓ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫర్నీచర్ తయారీ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బిల్డింగ్ మొత్తానికి వ్యాపించాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా లాభంలేకపోయింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అపార్టుమెంటు మొదటి, రెండో అంతస్తుల్లో ఉన్న 20 మందిని రక్షించారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పోలీసులు ఉస్మానియా దవాఖానకు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బాలిక శివప్రియ (10) మృతిచెందింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అంచనావేస్తున్నారు.