మెహిదీపట్నం, జూన్ 10 : గోల్కొండ బోనాలకు ప్రభుత్వం రూ.10 లక్షలను కేటాయించిందని, వాటిని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఖర్చు చేయనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలను ఘనంగా నిర్వహించడానికి అందరూ కృషి చేయాలన్నారు. శనివారం గోల్కొండ కోటలో జూన్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గోల్కొండ ఆషాఢ మాసం బోనాల నిర్వహణపై సమీక్షా సమావేశానికి మంత్రి తలసాని ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ముందుగా స్థానికుల అభిప్రాయాలను తీసుకున్న మంత్రి తదనంతరం శాఖల వారీగా అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బోనాల నిర్వహణకు సీఎం కేసీఆర్ రూ.15 కోట్లను కేటాయించారని, ఇప్పటికే చెక్కులను ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు.
గోల్కొండ బోనాలను విజయవంతంగా నిర్వహించడానికి యుద్ధప్రాతిపదికన అంతర్గత రోడ్ల నిర్మా ణం, సీసీ కెమెరాల ఏర్పాటు, రెయిలింగ్ నిర్మాణం, తాగునీటి సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 3డీ మ్యాపింగ్, కళాకారుల కేటాయింపు, ఆర్టీసీ సేవలు విస్తృతం చేయడం, విద్యుత్ సమస్యలు లేకుండా అదనపు ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయడం, వైద్య సేవలకు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఈ ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తారని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు.
చలో గోల్కొండ బోనాలు పేరుతో పోస్టర్లు తయారు చేయండి
గోల్కొండ బోనాలకు ఆర్టీసీ అధికారులు అదనంగా బస్సులు నడపాలని, రాష్ట్ర వ్యాప్తంగా గోల్కొండ బోనాలకు ప్రజలు వచ్చేలా ఆర్టీసీ కృషి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బస్సుల గురించి మాట్లాడే క్రమంలో చార్మినార్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ విజయ్భాను అదనంగా బస్సులు కేటాయిస్తామన్నారు. దీనికి స్పందించిన మంత్రి ఛలో గోల్కొండ పేరుతో పోస్టర్లను రూపొందించి ఆర్టీసీ బస్సులకు అంటిస్తే ప్రచారం బాగా జరిగి, సంస్థకు లాభం పెరుగుతుందని సూచించారు. అదే విధంగా గోల్కొండ బోనాల పర్యవేక్షణకు కోటలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసుకోవాలని దక్షిణ, పశ్చిమ మండలం డీసీపీ కిరణ్ఖరెకు సూచించారు. ఈ కంట్రోల్ రూంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్, నల్ కమిషనర్ రవికిరణ్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, దేవాదాయ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, డీసీపీ కిరణ్ఖరె ప్రభాకర్, జీహెచ్ఎంసీ సర్కిల్-13 డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, డీఎంఅండ్హెచ్వో డాక్టర్ వెంకటి, ట్రాఫిక్ డీసీపీ అశోక్కుమార్, ఏసీపీలు ఆర్జీ శివమారుతి, కోటేశ్వర్రావు, తహసీల్దార్ షేక్ హసినా, కార్వాన్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి ఠాకూర్ జీవన్సింగ్, నాయకులు శేఖర్రెడ్డి, కావూరి వెంకటేశ్, మాజీ కార్పొరేటర్లు బంగారి ప్రకాశ్, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోల్కొండ బోనాల కులవృత్తుల సంఘం చైర్మన్ సాయిబాబా చారి, నాయకులు శివశంకర్, శ్రీకాంత్చారి మంత్రి తలసానిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు.