సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ పథకమైన గృహ జ్యోతిని అమలు చేస్తున్నట్లు మంగళవారం ప్రభుత్వం ప్రకటించింది. ప్రజాపాలన దరఖాస్తు, తెల్లరేషన్ కార్డుతో పాటు ఆధార్కార్డు లింకున్న వారిని నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందేందుకు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు జోన్లు హైదరాబాద్ మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్లు ఉండగా, అందులో మొత్తం 9 సర్కిళ్లు ఉన్నాయి. ఆయా సర్కిళ్లలో ప్రాథమికంగా విద్యుత్ శాఖ అధికారులు ఈ నెల మొదటి వారం నుంచి 200 యూనిట్లలోపు విద్యుత్ను వినియోగించే వారిని గుర్తిస్తూ వస్తున్నారు. ఫిబ్రవరి 27నాటికి మొత్తం 10,93,228 మంది గృహ విద్యుత్ వినియోగదారులు ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు గుర్తించారు. కాగా ప్రజాపాలనలో గృహజ్యోతి కోసం గ్రేటర్ పరిధిలో 19.85లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గింది. గృహజ్యోతి పథకం కింద గుర్తించిన విద్యుత్ వినియోగదారులకు మార్చి నెల నుంచి జీరో బిల్లును విద్యుత్ శాఖ జారీ చేయనుంది. డిస్కమ్లు మార్చి 20వ తేదీలోపు ప్రభుత్వానికి సబ్సిడీ వివరాలను అందించాల్సి ఉంటుంది. వాటిని ప్రభుత్వం నేరుగా డిస్కమ్లకు చెల్లిస్తుంది. ఇప్పటివరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోనివారు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో, మునిసిపల్ కమిషనర్ కార్యాలయాల్లో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.