‘మట్టిని తాకిన చేతులకు మరిమరి దండాలో…
మొక్కలు నాటి చేతులకు పరిపరి దండాలో…’
అంటూ మహానగరం హరితస్ఫూర్తిని చాటింది. శనివారం ఒకే రోజు రికార్డు స్థాయిలో నేలతల్లికి మొక్కులు చెల్లించింది. ఇటు జీహెచ్ఎంసీ, అటు హెచ్ఎండీఏ.. ఒకదానికొకటి పోటీ పడుతూ స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించారు. హెచ్ఎండీఏకు 2.70 లక్షల మొక్కలను లక్ష్యంగా నిర్దేశించగా, రెట్టించిన ఉత్సాహంతో 9 కేంద్రాలలో 4.13 లక్షల మొక్కలు నాటింది. అలాగే జీహెచ్ఎంసీ లక్ష్యం 1.30 లక్షల మొక్కలు కాగా లక్ష్యాన్ని దాటి 1.50 లక్షల మొక్కలు నాటింది. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలోని అటవీ పార్కులో శనివారం కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, భూగర్భ గనులు, సమాచారశాఖల మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్రెడ్డితో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు. వెస్ట్మారేడ్పల్లిలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బంజారాహిల్స్ గఫార్ఖాన్ పార్కులో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, వీఎస్టీ వద్ద ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి కమిషనర్ రోనాల్డ్ రోస్, హిమాయత్ సాగర్లోని జలమండలి గార్డెన్లో ఎండీ దానకిశోర్ మొక్కలు నాటారు. ఇక మేడ్చల్ జిల్లాలో 74 వేల మొక్కలు నాటగా, దమ్మాయిగూడలో మంత్రి మల్లారెడ్డి, కూకట్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్లో ఎమ్మెల్యే వివేకానంద మొక్కలు నాటారు.
ఇప్పటివరకు…
సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న కోటి వృక్షార్చన ఒక పండగ వాతావరణంలో జరుగుతున్నదని, సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ప్రారంభించిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం పచ్చదనాన్ని గణనీయంగా పెంపొందిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. శనివారం మంచిరేవులలోని అటవీ పార్కులో కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, భూగర్భ గనులు, సమాచారశాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్రెడ్డిలతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో పండగ వాతావరణంలో మొక్కలు నాటుతున్నామని, హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 283 కోట్ల మొక్కలు నాటామని తెలిపారు. కార్యక్రమంలోప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎంపీ సంతోష్కుమార్, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, కాలె యాదయ్య, రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభివాణీదేవి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ చంద్రశేఖర్రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్ర మహేందర్ గౌడ్లతో పాటు అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భవిష్యత్తరాలకు ఇవ్వాల్సింది.. కాలుష్య రహిత వాతావరణం
మారేడ్పల్లి, ఆగస్టు 26: భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదని..కాలుష్య రహిత వాతావరణాన్ని ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్మారేడ్పల్లిలోని ప్రభుత్వ బాలికల కళాశాల ఆవరణలో శనివారం కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని మహోద్యమంలా చేపట్టిందన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా అడవుల పునరుద్ధరణ, గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పెద్ద ఎత్తున మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంచామన్నారు. గడిచిన తొమ్మిదేండ్లలో 7.7 శాతం పచ్చదనాన్ని పెంపొందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీసీ శంకర్, హార్టికల్చర్ డీడీ రాజ్ కుమార్, శానిటేషన్ డీఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పుడమి తల్లికి పచ్చని తోరణం
సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ మరోసారి హరిత స్ఫూర్తిని చాటింది. కోటి వృక్షార్చనలో భాగంగా జీహెచ్ఎంసీ వ్యాప్తంగా లక్షా 30వేల నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించి లక్షా 50వేల మొక్కలను నాటారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, డిప్యూటీ మేయర్ ఆయా నియోజకవర్గాల్లో అధికారులు, ప్రజలతో కలిసి విరివిగా మొక్కలు నాటారు. ఎల్బీనగర్ జోన్లో 30వేలు, చార్మినార్లో 20వేలు, ఖైరతాబాద్లో 20వేలు, శేరిలింగంపల్లిలో 30వేలు, కూకట్పల్లిలో 30వేలు, సికింద్రాబాద్లో 20వేల మొక్కలు నాటారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 292 లోకేషన్లలో లక్షా 50వేల మొక్కలు నాటినట్లు కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.
పచ్చదనం పెంపునకు అత్యంత ప్రాధాన్యత
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
పర్యావరణ పరిరక్షణతో పాటు సమతుల్యతను దృష్టిలో పెట్టుకొని నగరవాసులకు చక్కటి వాతావరణాన్ని కల్పించేందుకు వివిధ వినూత్న ఆలోచనలకు అనుగుణంగా విరివిగా మొక్కలు పెంచుతున్నట్లు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమం సందర్భంగా శనివారం బంజారాహిల్స్ గఫార్ఖాన్ పార్కులో మొక్కలు నాటారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో 2014 నుంచి 2022-23 నాటి వరకు 741 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా కాగా 698.78 లక్షల మొక్కలు నాటినట్లు మేయర్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల మొక్కల పెంపకం లక్ష్యం కాగా లక్ష్యాన్ని మించి.. 77.29 లక్షల మొక్కలు పెంచామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీకి కోటి మొక్కలు నాటే లక్ష్యం కాగా ఇప్పటి వరకు సుమారు 42 లక్షల మొక్కలు నాటినట్లు మేయర్ తెలిపారు.
నగరవాసులకు ఆహ్లాదకర వాతావరణం
బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్
ఆకుపచ్చని నగరంతో పాటు ప్రజలకు పరిశుభ్రమైన, ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. శనివారం ఎమ్మెల్యే ముఠా గోపాల్లో కలిసి వీఎస్టీ వద్ద కమిషనర్ రోనాల్డ్ రోస్ మొక్కలు నాటారు. రాష్ట్రంలో కోటి మొక్కలు నాటేందుకు లక్ష్యంలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో నిర్దేశించిన లక్షా 50వేల మొక్కల లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూబీడీ అడిషనల్ కమిషనర్ కృష్ణ, డైరెక్టర్ శ్రీనివాస్రావు, డీడీ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
హెచ్ఎండీఏ రికార్డు
కోటి వృక్షార్చనలో భాగంగా హెచ్ఎండీఏ రికార్డు స్థాయిలో మొక్కలు నాటింది. ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ కమిషనర్ అర్వింద్ కుమార్ పర్యవేక్షణలో హెచ్ఎండీఏ యంత్రాంగం, అర్బన్ ఫారెస్ట్ ఉద్యోగులు, సిబ్బంది వివిధ ప్రాంతాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కోటి వృక్షార్చనలో ప్రభుత్వం 2.70 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించగా, హెచ్ఎండీఏ 4.13 లక్షల మొక్కలను నాటింది.
-సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ)
ఆహ్లాదాన్ని పంచేలా..
అందమైన నందనవనం 256 ఎకరాల్లో సువిశాలంగా..
నార్సింగి-తెలంగాణ పోలీస్ అకాడమీ మధ్య ఔటర్ రింగు రోడ్డు సర్వీసు రోడ్డును ఆనుకొని 256 ఎకరాల్లో విస్తరించి ఉన్న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్కు ఐటీ కారిడార్లో.. అతి పెద్ద అటవీ పార్కుగా రూపుదిద్దుకున్నది. నగరవాసులకు మానసిక ఉల్లాసం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు సరికొత్త థీమ్లతో అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. ఫారెస్టు డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.7కోట్ల 38లక్షల నిధులతో అందమైన నందనవనంగా తీర్చిదిద్ది..అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐటీ కారిడార్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆకాశ హర్మ్యాలను వీక్షించేలా ఈ పార్కులో ఏర్పాటు చేసిన వాచ్ టవర్.. అదనపు ఆకర్షణగా నిలుస్తున్నది. గజిబో, వాకింగ్ ట్రాక్, రాక్ పెయింటింగ్, ఓపెన్ జిమ్, యాంపీ థియేటర్, వాటర్ ఫాల్ వంటివి ఆకట్టుకుంటున్నాయి.
– మణికొండ, ఆగస్టు 26
హరిత తెలంగాణ.. సీఎం కేసీఆర్ వల్లే..
తొమ్మిదేండ్లలో ఎవరూ ఊహించనంతగా అభివృద్ధి పనులు చేపట్టాం. చెట్లపొదలతో అటవీ ప్రాంతంగా దర్శనమిచ్చిన ప్రాంతాన్ని బీఆర్ఎస్ సర్కారు అద్భుతంగా తీర్చిదిద్దడంతో పాటు ఆహ్లాదకరమైన పార్కును అందుబాటులోకి తీసుకొచ్చింది. సువిశాలంగా కుటుంబసమేతంగా పార్కుకు వచ్చి సేదతీరే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. హరిత తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది.
-ప్రకాశ్గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే
కోటి వృక్షార్చనలో భాగంగా శనివారం జలమండలి ఎండీ దానకిశోర్ హిమాయత్ సాగర్లోని జలమండలి గార్డెన్లో మొక్కలు నాటారు. అంతరిస్తున్న అటవీ జాతి మొక్కల్ని రక్షించేందుకు మియావాకీ పద్ధతిలో వనాలను పెంచేందుకు జలమండలి కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో జలమండలి డైరెక్టర్లు డాక్టర్ ఎం. సత్యనారాయణ, అజ్మీరా కృష్ణ, శ్రీధర్బాబు, వాసుదేవనాయుడు, స్వామి, సీజీఎంలు వినోద్ భార్గవ, డీఎఫ్వో మోహన్ తదితరులు పాల్గొన్నారు.
హరితస్ఫూర్తి చాటేలా.. 74వేల మొక్కలు నాటి..
మేడ్చల్, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన కోటివృక్షార్చన విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా మేడ్చల్, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో కోటివృక్షార్చనలో మొక్కలు నాటే లక్ష్యం 73 వేలు కాగా.. 74 వేల మొక్కలు నాటినట్లు జిల్లా అటవీశాఖ అధికారి జానకీరామ్ తెలిపారు. దమ్మాయిగూడలో మంత్రి మల్లారెడ్డి మొక్కలు నాటగా, కూకట్పల్లిలో ఎమ్మెల్యే కృష్ణారావు, కుత్బుల్లాపూర్లో ఎమ్మెల్యే వివేకానంద్లతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పచ్చదనాన్ని పెంపొందిస్తున్నదన్నారు.