హరితహారానికి కోటి మొక్కలు సిద్ధం
ఔటర్ చుట్టూ 35 నర్సరీల్లో పెంపకం
వానలు పడగానే పంపిణీకి చర్యలు
ప్రత్యేకంగా 100 రకాల మొక్కలు
సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అందుకు అనుగుణంగానే హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మొక్కలను సిద్ధం చేస్తున్నది. ఇందుకు గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు పొడవునా ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటు చేసింది. సమారు 35 నర్సరీల్లో 2 కోట్లకు పైగా మొక్కలను పెంచుతున్నారు. 8వ విడుత హరితహారం కార్యక్రమానికి హెచ్ఎండీఏ ఏడు జిల్లాల పరిధిలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కోటికి పైగా మొక్కలను పంపిణీ చేయనున్నారు. వీటికి తోడు ఓఆర్ఆర్ చుట్టూ ఖాళీగా ఉన్న ప్రాంతాల్లోనూ పెద్ద మొత్తంలో మొక్కలను నాటనున్నారు. అటవీ ప్రాంతాలు, పార్కులు, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లోనూ పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరం చుట్టూ 35 నర్సరీలను నిర్వహిస్తున్న హెచ్ఎండీఏ ప్రత్యేకంగా 100కు పైగా వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. ప్రధానంగా రాగి, మర్రి, గుల్ మొహర్, నెమలి నార, నందివర్ధనం, పొగడ, పర్కియా, జామ, ఈత, వేప, బాదం, కానుగ, గన్నేరు, చింత, బోగన్ విల్లా, పాపయా, పెల్టోఫామ్, దేవ గన్నేరు, నేరేడు, మిల్లి, గ్రీన్ ఫండా, మద్ది, వెలగ, సంపంగి, మందారం తదితర 100కు పైగా వివిధ రకాల మొక్కలను పెంచి పెద్ద చేశారు. వాటిని ఏడు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ సంస్థలకు, స్థానిక ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచారు.
ఏటా కోటి మొక్కలు..
రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా రూపుదిద్దాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకంలో భాగంగా ఏటా కోటి మొక్కలను నాటుతున్నారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతలను హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం సమర్థవంతంగా చేపడుతున్నది. పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాలు, ఔటర్ రింగు రోడ్డు చుట్టూ ఉన్న ఖాళీ స్థలాలు ఇతర ప్రాంతాల్లోనూ వర్షాకాలం ప్రారంభంలోనే కోటికి పైగా మొక్కలు నాటి, వాటికి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. దీంతో నగరంలో ఎక్కడ చూసినా పచ్చదనం కనువిందు చేస్తున్నది. హరిత హారం కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖలు పాల్గొని తమ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాయి.. ప్రైవేటు సంస్థలు, వ్యక్తిగతంగానూ ఎంతో మంది ముందుకు వచ్చి మొక్కలు నాటుతూ పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు.