సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ): ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో మౌలిక వసతుల కల్పనకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికప్రాధాన్యతనిస్తున్నది. ఉప్పల్ మెట్రో డిపో, నాగోల్ మెట్రో స్టేషన్ ఇరువైపులా సుమారు 430కి పైగా ఎకరాల్లో మూసీ వెంబడి హెచ్ఎండీఏ భారీ లేఅవుట్ను అభివృద్ధి చేసింది. ఇప్పటికే అత్యంత విశాలమైన 150, 120, 80, 60 ఫీట్ల వెడల్పుతో కూడిన రోడ్లను, మూసీ వెంబడి తీరం ప్రాంతంలో 3 కి.మీ పొడవైన పార్కును అభివృద్ధి చేసింది.
నివాసాలకు అత్యంత అనువుగా ఉండటంతో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణంతో పాటు అపార్టుమెంట్లు, భారీ బహుళ అంతస్థుల భవనాలు ఏర్పాటు కాగా.., మరిన్ని పురోగతిలో ఉన్నాయి. తాజాగా స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో అత్యాధునిక విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకోసం సుమారు రూ.1.42 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. విద్యుద్దీపాల ఏర్పాటును వెంటనే పూర్తి చేసేందుకు అధికారులు ఇటీవల టెండర్లు సైతం పిలిచారు. నెల రోజుల వ్యవధిలోనే ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో అవసరమైన ఎల్ఈడీ లైట్లను, కేబుల్స్ను మార్చివేయనున్నామని అధికారులు తెలిపారు.