వనస్థలిపురం, ఆగస్టు 16 : సాహెబ్నగర్లో డ్రైనేజీ పూడిక తొలగించేందుకు దిగి ఇద్దరు కార్మికులు మృతి చెందిన విషయం విధితమే. మృతులు అంతయ్య, శివకుమార్ కుటుంబాలకు ప్రభుత్వం రూ.15లక్షలు ఆర్థిక సహాయం అందజేసింది. దాంతోపాటు బాధితు కుటుంబాల కోరిక మేరకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. సోమవారం నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డిలు ఇండ్లు మంజూరు పత్రాలను, ఇంటి తాళాలను అందజేశారు.
వనస్థలిపురం రైతుబజార్ వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు పూర్తి అండగా ఉంటామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పదిరోజుల లోపే ఇండ్లు అందజేశామన్నారు. ఇండ్ల మంజూరుపై బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.