సిటీబ్యూరో, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): కోటి మందికి పైగా నివసిస్తున్న మహానగరం. అయితే బాధ్యతాయుతంగా ఉండాల్సిన ఓటరు ప్రతీసారి ఎన్నికలకు దూరంగా ఉండటంతో ఓటింగ్ శాతం చాలా తకువగా నమోదవుతోంది. ఏ ఎన్నికలైనా 50 శాతానికి మించి దాటడం లేదు. ఓటర్లలో నిర్లిప్తతతో పోలింగ్ కేంద్రాలకు రావడం లేదనే విమర్శలున్నాయి. ముఖ్యంగా చదువుకున్న వారు, ఐటీ ఉద్యోగులు, యువత నిరాసక్తత వదిలి ఉత్సాహంగా ఓటు వేసేలా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టిసారించినా ఫలితం ఉండటం లేదు.
గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో 48.89 శాతం పోలింగ్ నమోదు అయితే ఈసారి 47.88 శాతం మాత్రమే నమోదైంది. అంటే 1.01 శాతం తక్కువగా నమోదైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే అత్యల్పంగా 47.88 శాతం నమోదు కావడం శోచనీయం. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో పరిశీలిస్తే గోషామహల్లో 55.38 శాతం నమోదు కాగా, అతి తక్కువగా యాకుత్పురలో 39.64 శాతం నమోదైంది. మొత్తంగా ఓటింగ్లో పురుషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలో పురుషులు 11,29,959 మంది, మహిళలు 10,42,087 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం అనుకున్నంతగా పెరగకపోవడంతో తగ్గిన పోలింగ్ సరళితో ఎవరికి నష్టం! అన్నదానిపై రాజకీయ పార్టీల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.