నాంపల్లి కోర్టులు, నవంబర్ 13(నమస్తే తెలంగాణ): అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన దుండగులు దాడికి పాల్పడటంపై రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్రాజ్ను తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ సభ్యులు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. దాడికి ప్రేరేపించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు దాడికి పాల్పడిన వారిపై కఠనంగా చర్యలు తీసుకోవాలని, రేవంత్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి అనర్హుడిగా ప్రకటించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇటీవల దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కూడా కత్తితో దాడికి పాల్పడిన ఘటన మరవక ముందే మరో ఎమ్మెల్యే గువ్వలపై దాడి చేయడం అమానుషమన్నారు.
ఓటమి భయంతో బీఆర్ఎస్ అభ్యర్థులపై దాడులకు కాంగ్రెస్ పార్టీకి చెందిన దుండగులను ప్రేరేపిస్తున్న పార్టీ అధినేత రేవంత్ రెడ్డిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, స్పోక్స్ పర్సన్ దాసోజు శ్రవణ్ కుమార్, హైకోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కళ్యాణ్ రావు చెంగల్వ, లీగల్ సెల్ సభ్యులు లలితారెడ్డి, జక్కుల లక్ష్మణ్ పాల్గొన్నారు.