బడంగ్పేట్,మార్చి 28: ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని, కార్యకర్తలే పార్టీకి బలమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం అమీర్పేట్ గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు ఏమీ చేయలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం వారి ఉనికి కాపాడుకోడానికే చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అమలవుతున్న పింఛన్లు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడ అమలు చేస్తున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. ఇంటి స్థలం ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద రూ. 3 లక్షలు ఇవ్వబోతుందన్నారు. అర్హులైన ప్రతి దళితుడికి దళిత బంధు అందిస్తామని తెలిపారు. నిత్యావసర ధరలు పెంచి బీజేపీ పేదల నడ్డి విరుస్తున్నదని, ఆ పార్టీ వాళ్లు వచ్చి ఓట్లు అడిగితే గ్యాస్ ధరలు తగ్గించి ఓట్లు అడగాలని ప్రజలకు సూచించారు.
ప్రతి గడపకు సంక్షేమ పథకాలు : మంచిరెడ్డి
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు తీసుకెళ్లాలని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. మహిళా సంఘాలకు ఒక్కొక్క గ్రూపునకు రూ. 20 లక్షలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి కార్యకర్తలు సైనికుడిలా పనిచేయాలన్నారు. రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ… రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ భరోసా కల్పిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ఎంపీపీ సునీతా ఆంద్యానాయక్, సహకార బ్యాంకు చైర్మన్ పాండుయాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు బాలకిషన్,మండల పార్టీ అధ్యక్షుడు రాజునాయక్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరిగౌడ్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు చంద్రయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్రెడ్డి,నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నేడు మాదాపూర్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం
మాదాపూర్, మార్చి 28: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు బుధవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యానగర్ ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్. రమణతో పాటు కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ హాజరు కానున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు జరుగనున్న ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, వార్డు సభ్యులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, ఉద్యమ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు హాజరు కావాలని ఎమ్మెల్యే కోరారు.
జల్పల్లి మున్సిపాలిటీ శ్రీరామకాలనీలో..
పహాడీషరీఫ్, మార్చి 28: జల్పల్లి మున్సిపాలిటీ పరిధి శ్రీరామకాలనీలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు మున్సిపాలిటీ బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు విస్కమూరి నిరంజన్ తెలిపారు. శ్రీరామకాలనీలోని విజయలక్ష్మి గార్డెన్లో ఉదయం 11 గంటలకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరుకానున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కో -ఆప్షన్ మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.