Health Tips | నమస్తే మేడం. డెంగీ, మలేరియా, చికున్గున్యా, టైఫాయిడ్లాంటి జ్వరాలు ప్రబలే సమయమిది. వీటి బారినపడితే, త్వరగా కోలుకునేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.
ఓ పాఠకురాలు
వానకాలం జ్వరాలు సర్వసాధారణం. దీంతో శరీర ఉష్ణోగ్రతలు ఉన్నట్టుండి పెరిగి తగ్గుతుంటాయి. ఒళ్లంతా చెమటలు పడుతుంటాయి. అందుకే, ఈ సమయంలో శరీరంలో నీటి స్థాయి సరిపడా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. ఇందుకోసం జీలకర్ర, అల్లం, పసుపు, తులసి వేసిన నీళ్లలాంటివి ఆరారగా తాగుతూ ఉండాలి. పంపుల్లో వచ్చే మంచినీళ్లను కాచి చల్లార్చిన తర్వాతే తీసుకోవాలి. టమాటా, క్యారెట్లాంటి కూరగాయలతో సూపులు చేసుకుని తాగొచ్చు. మాంసాహారులైతే బోన్ సూప్, చికెన్ సూప్లాంటివి తీసుకోవచ్చు. జ్వరాల కారణంగా కలిగే ఇన్ఫ్లమేషన్స్ (లోపలి వాపులు) తగ్గించేందుకు అల్లం నీళ్లు బాగా సహకరిస్తాయి. అలాగే పండ్లలోనూ నీటిశాతం అధికంగా ఉంటుంది.
ఈ సీజన్లో దొరికే స్ట్రాబెర్రీలాంటి వివిధ ఫలాలను తీసుకోవడం మేలు. జ్వరం వచ్చినప్పుడే కాదు.. రాక మునుపు, తగ్గిన తర్వాత కూడా పండ్లు తినడం వల్ల వాటిలోని యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ సమయంలో బయటి ఆహారం, జంక్ఫుడ్ జోలికి వెళ్లకపోవడం మంచిది. సలాడ్లు తీసుకోవాలనుకుంటే.. ఉడికించిన కూరగాయలు, ఆకుకూరలనే తినాలి. రాజ్మా, చనా లాంటివైనా మంచిదే. అందులోని ప్రొటీన్ వల్ల శరీరం త్వరగా కోలుకుంటుంది. జ్వరం ఉన్నప్పుడు సిరిధాన్యాలతో చేసిన ఇడ్లీలు తినొచ్చు. రాగి జావలాంటివి తాగొచ్చు. జొన్న, కొర్ర రవ్వతో చేసిన ఉప్మా, కిచిడీలాంటివైనా ఫర్వాలేదు. పాలు, మజ్జిగ కూడా ఈ సమయంలో శరీరానికి శక్తినిస్తాయి. విషక్రిములు విస్తరించే కాలంలో ఆహారమే తొలి ఔషధం.
మయూరి ఆవుల న్యూట్రిషనిస్ట్ Mayuri.trudiet@ gmail.com