Doom Scrolling | రాత్రి నిద్రించే ముందు గదిలో లైట్లు ఆఫ్ చేసి మంచంపై పడుకుని మొబైల్లో గంటల తరబడి సోషల్ మీడియా, వార్తలు లేదా ప్రతికూల సమాచారాన్ని నిరంతరం స్క్రోల్ చేయడం ప్రస్తుతం చాలా మందికి అలవాటుగా మారింది. అయితే ఈ అలవాటు కేవలం నిద్రను మాత్రమే కాదు, మెదడు పనితీరును కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మైగ్రేన్ తలనొప్పులు, నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలకు ఇది ప్రధాన కారణంగా మారే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. నిరంతరం ప్రతికూల సమాచారాన్ని గ్రహించడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి, నిద్ర నాణ్యత గణనీయంగా దెబ్బతింటుంది. మానసిక ఆరోగ్యం, సాంకేతిక వినియోగంపై ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం, డూమ్ స్క్రోలింగ్ అలవాటు ఆందోళన, డిప్రెషన్, మానసిక ఒత్తిడి పెరగడంతోపాటు జీవితంలోని కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది.
రాత్రి సమయంలో మొబైల్, ట్యాబ్లెట్ లేదా ఇతర డిజిటల్ పరికరాల నుంచి వెలువడే నీలి కాంతి (బ్లూ లైట్) శరీరంలో నిద్రకు అవసరమైన మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో శరీరానికి నిద్ర సమయం వచ్చిందనే సంకేతం అందక, నిద్ర పట్టడం ఆలస్యమవుతుంది. దీనివల్ల నిద్ర చక్రం కూడా దెబ్బతింటుంది. చీకటి గదిలో ప్రకాశవంతమైన మొబైల్ స్క్రీన్ను ఎక్కువసేపు చూడటం వల్ల కళ్లపై అధిక ఒత్తిడి పడుతుంది. కాంతి వ్యత్యాసం కారణంగా కళ్ల అలసట, తలనొప్పి, మైగ్రేన్ దాడులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. నిద్రకు ముందు వరుసగా వీడియోలు, వార్తలు, సోషల్ మీడియా పోస్టులు చూడటం వల్ల మెదడు నిరంతరం అప్రమత్త స్థితిలోనే ఉంటుంది. దీంతో శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్లలేకపోతుంది. లోతైన నిద్రకు అవసరమైన ప్రశాంతత దూరమవుతుంది.
ప్రతికూల వార్తలు లేదా కలవరపెట్టే కంటెంట్ను వరుసగా చూడటం వల్ల ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఆందోళనను మరింత పెంచి, రాత్రివేళల్లో మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది. మైగ్రేన్కు గురయ్యే వారిలో కళ్ల ఒత్తిడి, బ్లూ లైట్ ప్రభావం, మానసిక ఒత్తిడి, అధిక సమాచార భారం కలిసి తలనొప్పిని ప్రేరేపిస్తాయి. దీంతో కాంతి, శబ్దం వంటి అంశాల పట్ల అధిక సున్నితత్వం పెరగడం, తీవ్రమైన తలనొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం, పడుకునే ముందు ప్రతి గంట స్క్రీన్ వినియోగం నిద్రలేమి ప్రమాదాన్ని సుమారు 59 శాతం వరకు పెంచుతుంది. ప్రతి అదనపు గంట స్క్రీన్ చూసే అలవాటు వల్ల సగటున 24 నిమిషాల నిద్ర తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. మెలటోనిన్ విడుదల ఆలస్యం కావడం, మెదడు చురుకుగా ఉండడం, మధ్య మధ్యలో మెళకువ రావడం, నిద్ర నాణ్యత తగ్గడం ఇందుకు ప్రధాన కారణాలు.
రాత్రి మొబైల్ వినియోగం అధికమైతే నిద్ర పట్టడానికి ఎక్కువ సమయం పట్టడం, ఉదయం లేవగానే తలనొప్పి ఉండటం, కళ్లలో మంట లేదా అసౌకర్యం, ఆందోళన పెరగడం, మరుసటి రోజు ఏకాగ్రత తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి డూమ్ స్క్రోలింగ్ ప్రభావానికి సంకేతాలుగా పరిగణించవచ్చు. ఈ అలవాటును తగ్గించుకోవాలంటే పడుకునే సమయానికి కనీసం 30 నుంచి 60 నిమిషాల ముందే మొబైల్, టీవీ వంటి స్క్రీన్ల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలి. దీంతో మెదడు క్రమంగా ప్రశాంత స్థితిలోకి వెళ్లి నిద్రకు సిద్ధమవుతుంది. పడకగదిలో మసక వెలుతురు లేదా వెచ్చని కాంతిని ఉపయోగించడం మంచిది. పూర్తిగా చీకటిలో మొబైల్ చూడడం వల్ల కళ్లపై పడే ఒత్తిడి మరింత పెరుగుతుంది. నిద్రకు ముందు సోషల్ మీడియా స్క్రోల్ చేయడం బదులుగా ప్రశాంతమైన సంగీతం, పాడ్కాస్ట్లు వినడం లేదా పుస్తకం చదవడం వంటి తక్కువ ఉత్తేజాన్ని కలిగించే కార్యకలాపాలను అలవాటు చేసుకోవడం ఉపయోగకరం. రాత్రి సమయంలో తప్పనిసరిగా మొబైల్ ఉపయోగించాల్సి వస్తే నైట్ మోడ్ లేదా బ్లూ లైట్ ఫిల్టర్ను ఆన్ చేయడం ద్వారా కళ్లపై ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.
డూమ్స్క్రోలింగ్ స్థానంలో ప్రతిరోజూ ఒక స్థిరమైన విండ్డౌన్ రొటీన్ను అలవాటు చేసుకోవాలి. శ్వాస వ్యాయామాలు, ధ్యానం, తేలికపాటి స్ట్రెచింగ్ వంటి అలవాట్లు మానసిక ప్రశాంతతను పెంచి మెరుగైన నిద్రకు సహాయపడతాయి. మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు, రోజంతా స్క్రీన్లను ఎక్కువగా ఉపయోగించే వారు, ఆందోళనకు గురయ్యే వ్యక్తులు, యువత ఈ అలవాటు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట డూమ్స్క్రోలింగ్ సాధారణ అలవాటులా కనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో మెదడు ఆరోగ్యం, నిద్ర నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. చిన్నచిన్న జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా మైగ్రేన్, నిద్రలేమి ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.