Weight Loss With Turmeric | శరీర బరువు తగ్గించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వంటివి అనేకం చేస్తూ ఉంటారు. ఇది అంతా కూడా ఒక పెద్ద ప్రక్రియ అని చెప్పవచ్చు. ఇవన్నీ చేస్తూనే కొన్ని మూలికలను తీసుకోవడం వల్ల జీవక్రియ వేగం పెరగడం, జీర్ణక్రియ మెరుగుపడడం, ఆకలి తగ్గడం వంటివి జరుగుతాయి. ఇవన్నీ కూడా బరువు తగ్గడానికి మద్దతు ఇస్తాయని చెప్పవచ్చు. బరువు తగ్గడానికి మరింత మద్దతును ఇచ్చే వాటిల్లో ప్రసిద్దమైనది పసుపు అని చెప్పవచ్చు. పసుపు అందరికీ తెలిసిందే. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పసుపు వాపును తగ్గించడంలో, కొవ్వును తగ్గించడంలో, శరీర బరువును తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శోథ నిరోధక లక్షణాలతో పాటు, బరువును తగ్గించే లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. కర్కుమిన్ శరీర ద్రవ్యరాశి సూచిక, బరువు, నడుము చుట్టుకొలతను తగ్గించడం ద్వారా జీవక్రియలను మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా కర్కుమిన్ ను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం ద్వారా శరీర బరువు నియంత్రణలో మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు ఆహారంలో భాగంగా పసుపును సరైన పద్దతిలో తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. బరువు తగ్గాలనుకునే వారు పసుపును తీసుకునే సరైన మార్గాల్లో పసుపు నీరు కూడా ఒకటి. ఇది చాలా సులభమైన మార్గం. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ పసుపు, చిటికెడు నల్ల మిరియాల పొడి వేసి కలపాలి. ఈ నీటిని ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీర బరువు తగ్గుతుంది.
అదేవిధంగా పసుపు టీని కూడా తయారు చేసి తీసుకోవచ్చు. నీటిలో ఒక టీ స్పూన్ పసుపు, చిటికెడు నల్ల మిరియాల పొడివేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని గోరు వెచ్చగా తాగాలి. ఇలా చేయడం వల్ల శరీర జీవక్రియల వేగం పెరిగి వేగంగా బరువు తగ్గవచ్చు. అలాగే ఒక కప్పు పాలల్లో చిటికెడు నల్లమిరియాల పొడి, ఒక టీ స్పూన్ పసుపు, కొద్దిగా తేనె వేసి కలిపి తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గవచ్చు. పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ దీనిని తీసుకునే విషయంలో జాగ్రత్తలు వహించడం కూడా చాలా అవసరం. ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు, ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడే వారు పసుపును తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. అలాగే దీనిని మితంగా తీసుకోవాలి. పసుపును అతిగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, పొట్టలో అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉందని వైద్యులు సూచిస్తున్నారు.