రాష్ట్రంలో క్రీడలను, క్రీడాకారులను, కోచ్లను ప్రోత్సహించేలా త్వర లో క్రీడా పాలసీని ఆవిష్కరిస్తామని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. అసెంబ్లీలో బుధవారం బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో స్టేడియాల నిర్మాణం చేపట్టామని, ఇప్పటికే 36 స్టేడియాలు పూర్తయ్యాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కృషితో రామప్ప సహా అనేక ప్రాంతాలు ప్రపంచం దృష్టికి వెళ్లాయని, పర్యాటకుల సంఖ్య పెరిగిందని తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద బుద్ధవనం త్వరలో నాగార్జునసాగర్ వద్ద ప్రారంభానికి సిద్ధమైందన్నారు.
ఆకుపచ్చ తెలంగాణ: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హరితహారం కార్యక్రమంతో రాష్ట్రం ఆకు పచ్చని తెలంగాణగా మారుతున్నదని అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 3.67 శాతం పచ్చదనం పెరిగిందని తెలిపారు. అసెంబ్లీలో బుధవారం అటవీ, దేవాదాయశాఖలపై పద్దులపై చర్చలో ఇంద్రకరణ్రెడ్డి సమాధానమిచ్చారు. అటవీశాఖలో 2,077 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతున్నదని చెప్పారు. 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 217 కోట్ల మొక్కలను నాటామని తెలిపారు. మొక్కల పెంపకానికి నూతన పంచాయతీరాజ్, మున్సిపాలిటీ చట్టాల్లో 10 శాతం గ్రీన్ బడ్జెట్కు నిధులు కేటాయించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆలయాలను పెద్దఎత్తున అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ యాదాద్రి దేవాలయాన్ని నభూతో న భవిష్యత్ అన్నట్టు అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.
దేవాలయాలకు పుష్కలంగా నిధులు: విప్ గొంగిడి సునీత
రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి టీఆర్ఎస్ సర్కారుతోనే సాధ్యమవుతున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత చెప్పారు. బుధవారం శాసనసభలో ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు దేవాలయాల అభివృద్ధికి ఒక్క పైసా ఇవ్వలేదని గుర్తుచేశారు. కానీ, తమ ప్రభుత్వం పుష్కలంగా నిధులు ఇస్తున్నదని, పూజారులను గౌరవించి ధూపదీప నైవేద్య పథకం కింద నెలకు రూ.6 వేలు అందజేస్తున్నదని తెలిపారు. యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణం ఒక అద్భుతంగా నిలుస్తుందని పేర్కొన్నారు.