సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం (యుటీ) చేసి నగరాన్ని లూటీ చేయాలని బీజేపీ కుట్రలు చేస్తున్నదని, దీన్ని అడ్డుకోవాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. పదేళ్లుగా ప్రధానిగా పనిచేసిన మోదీ తెలంగాణకు, హైదరాబాద్కు ఏం అభివృద్ధి చేశావో చెప్పి ఓట్లు అడగాలని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని తిలక్నగర్ రోడ్డు షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “ అంబర్పేటలో వర్షం పడుతున్నా ఓపిగ్గా ఉన్నారంటే మీరు గొప్పవారు. ఎందుకంటే మంచి ఎమ్మెల్యేను కాలేరును 2 సార్లు గెలిపించినందుకు మీకు ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కిరి కిరి పార్టీ అయితే… బీజేపీ కుర్ కురే పార్టీగా మారింది. ఈ రెండు పార్టీలతో తెలంగాణ అభివృద్ధి జరగదు.”
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 10 నుంచి 12 సీట్లు ఇస్తే ఏడాదిలోగా మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తదని కేటీఆర్ అన్నారు. బీజేపి వాళ్లు గుడికట్టినం ఓటు వేయాలంటున్నారని.. మరి ఎంతో అద్భుతంగా కేసీఆర్ యాదాద్రి కట్టారని, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నిర్మించారని చెప్పారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునే వాళ్లంతా ఈ నెల 13న ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఉన్న కిషన్రెడ్డి గతంలో హైదరాబాద్కు వరదలు వస్తే రూపాయి సాయం చేశాడా..? ఐదేండ్లు కేంద్ర మంత్రిగా ఉండి అంబర్పేటకు రూ.5 పనిచేశాడా? ఒక్క విద్యా సంస్థ, కాలేజ్, ఒక్క గుడి కట్టాడా? అని కేటీఆర్ ప్రశ్నించారు. “మళ్లీ బీజేపీకి ఓటు వేస్తే పెట్రోల్, డీజిల్ లీటర్ ధర రూ.400 అయితది. అసలు బీజేపీ వాళ్లకు ఎందుకు ఓటెయ్యాలి.” నగరంలో మెట్రో విస్తరించేందుకు ఒక్క పైసా ఇయ్యలేదన్నారు. జూన్ 2తో ప్రత్యేక తెలంగాణ రాష్ర్టానికి 10 ఏళ్లు నిండుతాయి. హైదరాబాద్ పై పట్టుకోసం ఢిల్లీని చేసినట్లు భాగ్యనగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని చూస్తున్నరని తెలిపారు. “సికింద్రాబాద్లో బీజేపోళ్లే కిషన్ రెడ్డి హఠావో సికింద్రాబాద్ బచావో అంటున్నరు.” 2014, 2018లో బీజేపీని ఓడించింది బీఆర్ఎస్సేనన్నారు.
ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే కుటుంబ సభ్యులతో కలిసి టీవీలు చూసే పరిస్థితి తెలంగాణలో లేకుండా పోయిందన్నారు. నేను లంకెలు బిందెలు ఉన్నాయనుకొని వచ్చానని, అసలు వాటి కోసం వచ్చేది దొంగలు కదా? ఒక ముఖ్యమంత్రి అయి ఉండి అలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని కేటీఆర్ అన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం రేవంత్రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని, 6 గ్యారెంట్లో 5 అమలు చేశామని అంటున్నారు.. అసలు అమలయ్యాయా? అని నిలదీశారు. లక్ష లగ్గాలు అయినవి, వాటికి డబ్బులు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి నీ లగ్గం ప్రజలు చేస్తారని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తే జిల్లాలు, గ్రామీణ ప్రాంతా ల్లో ప్రజలు నమ్మి మోసపోయారన్నారు. రూ.2500 మహిళలకు ఇచ్చినమని రాహుల్గాంధీ చెబుతుండు.. మరి వచ్చినయా? వృద్ధులకు రూ.4వేలు అన్నాడు.. వచ్చినయా? అని ప్రశ్నించారు. “ఈ పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్, మల్కాజిగిరి స్థానాలను మనమే గెలుస్తున్నాం. పజ్జన్నకు అంబర్పేటలో 50వేల మెజార్టీ రావాలి.” 24 ఏళ్లుగా కేసీఆర్తో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండే పజ్జన్నను గెలిచిపించాలని కేటీఆర్ కోరారు.